బాన్సువాడ రూరల్(కామారెడ్డి) : దేశంలోనే ఎక్కడా లేని విధంగా రూ. 6వేల కోట్లతో 46వేల చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్(CM KCR) కే దక్కిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Speaker Pocharam) అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామ చెరువు కట్టపై నిర్వహించిన ఉరూరా చెరువుల పండుగ(Festival of Ponds) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన స్పీకర్ను మహిళలు బోనాలు, బతుకమ్మలతో, గంగపుత్రులు వలలతో స్వాగతం పలికారు. మహిళలతో కలిసి స్పీకర్ పోచారం బోనం ఎత్తుకొని నడిచారు. అనంతరం చెరువు కట్టపై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 70 ఏండ్లు పాలించిన ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో చేసి చూపించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వచ్చిందని పేర్కొన్నారు.ఎక్కడైతే నీటి సౌకర్యం ఉంటుందో ఆ ప్రాంతం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుందని స్పీకర్ అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. సుపరిపాలన అందించే ప్రభుత్వాలను ప్రజలు ఆదరించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, నీటి పారుదశాల శాఖ అధికారులు పాల్గొన్నారు.