హైదరాబాద్: శాంతి, సామరస్యంతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ చెప్పిన పద్ధతులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. మానవ వనరులు వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. గాంధీ వర్ధంతి సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ ఆవరణలో మహాత్మునికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు మాటలతోనే కాకుండా చేతలతో సాయం చేయాలన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ మాత్రమే అమలు చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరిస్తున్నాయని చెప్పారు. కేంద్రం కొన్ని విషయాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వాస్తవాలను దాచలేకపోతున్నదని తెలిపారు.
దేశంలోని సమాఖ్య వ్యవస్థ, లౌకిక విధానాన్ని కాపాడుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు రాజ్యాంగానికి ఆటంకం కలిగిస్తున్నాయని చెప్పారు. వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. శాసన మండలి, శాసన సభ, గవర్నర్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా అన్నీ సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.