బాన్సువాడ, సెప్టెంబర్ 16: దేశాన్ని డబ్బు ఏండ్లకుపైగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం, కరెంట్, తాగు, సాగునీరు అందించలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. సమాజంలో 56 శాతం ఉన్న వెనుకబడిన వర్గాల ప్రజలకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర అన్యాయం చేశాయని మండిపడ్డారు. ఇప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తాగడానికి మంచినీరు సైతం అందించలేకపోతున్నారని దుయ్యబట్టారు. అలాంటి వాళ్లు మళ్లీ మాయమాటలు చెప్పడానికి వస్తారని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారిని నమ్మితే మళ్లీ మోసపోతామని, మన బిడ్డల భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్లో 6.70 కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల కళాశాల భవనాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి గంగుల శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో స్పీకర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 57 ఏండ్లకే పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నట్టు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాలను వదులుకుంటానని ప్రకటించారు. విద్యతోనే విద్యార్థుల జీవితానికి వెలుగని, పేదలు ఆర్థికంగా బాగుపడాలంటే విద్యతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. 2014కు ముందు 230 గురుకులాలుంటే, ఇప్పుడా సంఖ్య 1,106కు చేరిందని అన్నారు. కేసీఆర్ సర్కార్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పేదబిడ్డలకు మంచి విద్య అందించడానికే గురుకులాల ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. దేశం లో మిగతా ముఖ్యమంత్రులు 70 ఏండ్ల నుం చి ఏం చేశారని ప్రశ్నించారు. కరెంటు, సాగునీరు లేదు. పండిన పంటలను కొనేదిక్కు లేదని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ రైతులకు అన్ని విధాలా సహకరిస్తున్నదని తెలిపారు. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, పంటలకు మద్దతు ధర ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.