హైదరాబాద్, మార్చి 14 : శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ అంశంపై సభాపతికే విజ్ఞప్తి చేసుకోవాలని వారికి సూచించింది. చట్టసభ నిర్ణయాలపై సమీక్ష నిర్వహించే అధికారం కోర్టులకు చాలా తక్కువగా ఉంటుందని, రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోగలవని గుర్తుచేసింది. సభలో సభ్యులకు అన్యాయం జరిగితే న్యాయం కోసం కోర్టులను కాకుండా స్పీకర్నే ఆశ్రయించాలని తెలిపింది. సభలో ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ.. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు నేరుగా స్పీకర్ను కలుసుకొనే అవకాశం కల్పించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఏ వెంకటేశ్వర్రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై స్టే విధించాలని ఇంతకుముందు బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసుకొన్న మధ్యంతర పిటిషన్ను హైకోర్టు సింగిల్ జడ్జి తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై శని, ఆదివారాల్లో అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన ద్విసభ్య ధర్మాసనం.. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపింది.
హైకోర్టు జారీచేసిన నోటీసులను అసెంబ్లీ కార్యదర్శి స్వీకరించలేదని, ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. దీనిపై న్యాయశాఖ కార్యదర్శి తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. చట్టసభల నిర్ణయాలపై సమీక్షించే అధికారం కోర్టులకు లేదని, సుప్రీంకోర్టు సైతం పలుమార్లు ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. అసెంబ్లీ కార్యదర్శితోపాటు, అసెంబ్లీ సచివాలయ కార్యదర్శికి స్వయంగా నోటీసులు అందజేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. నోటీసులు అందేలా చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్కు కూడా ఆదేశాలు జారీచేయడంతో ప్రతివాదులకు నోటీసులు అందజేశారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరిగి ప్రారంభమైన విచారణకు ప్రతివాదులు గానీ, వారి తరఫు న్యాయవాదులు గానీ హాజరు కాలేదు. దీంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం (మార్చి 15)తో ముగియనున్నాయని, ఈలోగా ఈ వ్యాజ్యంపై విచారణ పూర్తిచేసి ఉత్తర్వులను జారీచేసేందుకు తగినంత సమయం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని శాసనసభ స్పీకరే పరిషరించాలని పేర్కొంటూ.. బీజేపీ ఎమ్మెల్యేల హౌస్ షన్ పిటిషన్పై విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించింది. కాగా, బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన వ్యాజ్యం హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం వద్ద విచారణలో ఉన్నది.