హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సోమవారం ఉదయం నుంచి ఆదిలాబాద్, కుమ్రంభీం, ములుగు, మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదవ్వగా, పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల వరకు ఉంటాయని, సాయంత్రం వాతావరణ పరిస్థితులు మారతాయని తెలిపింది.