Ganga Pushkaralu 2023 | హైదరాబాద్ : ఈ నెల 22వ తేదీ నుంచి గంగా నది పురష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గంగా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
సికింద్రాబాద్, ప్రయాగ్రాజ్, వారణాసి మీదుగా రక్సోల్ వరకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఏప్రిల్ 23, 30, మే 7 తేదీల్లో ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. తిరుపతి, ప్రయాగ్రాజ్, వారణాసి మీదుగా దానాపూర్ వరకు ఏప్రిల్ 22, 29, మే 6 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. గుంటూరు, ప్రయాగరాజ్ మీదుగా బెనారస్ వరకు ఏప్రిల్ 22, 29, మే 6 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
భారత దేశ జీవనవాహిని గంగానది. ప్రేమగా గంగ అని పిలుచుకుంటారు. గంగమ్మ అని గౌరవిస్తారు. గంగమ్మతల్లీ అని పరవశించిపోతారు. భారతీయ సాంస్కృతిక వైభవంలో యుగాలుగా తన ప్రత్యేకతను చాటుకున్న గంగానది పుష్కరశోభను సంతరించుకుంటున్నది. స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ శుక్ల పాడ్యమి తేది 21-4-2023 శుక్రవారం తెల్లవారితే శనివారం అనగా రా.తె. 5-09 గంటలకు దేవ గురువు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
ఈ క్రమంలో ఏప్రిల్ 22 నుంచి సార్ధ త్రికోటి సహిత గంగానది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పన్నెండు రోజులు కొనసాగి మే 3వ తేదీతో ముగియనున్నాయి. పుష్కరాల సమయంలో పితృదేవతల ప్రీత్యర్థం స్నాన, దాన, తర్పణ, పిండ ప్రదానాలు చేయడం పుణ్యప్రదం.