SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ చివరలో పాఠశాలలకు సైతం సెలవులు ప్రకటించనున్నారు. దీంతో చాలామంది వివిధ ప్రాంతాలకు వెళ్లే అవకాశాలుండడంతో రద్దీ పెరిగే అవకాశం ఉంది.
ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనున్నది. పలు రైళ్లు సికింద్రాబాద్ నుంచి నడువనుండగా.. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది. పాట్నా-సికింద్రాబాద్ (03253) మధ్య మే ఒకటి నుంచి జూలై 31 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో నడుస్తుందని పేర్కొంది. హైదరాబాద్ – పాట్నా (07255) రైలు మే 8 నుంచి జూలై 31 వరకు ప్రతి బుధవారం పరుగులు తీయనున్నది.
సికింద్రా-పాట్నా (07256) ప్రత్యేక రైలు మే 3 నుంచి ఆగస్టు 2 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. దానాపూర్-సికింద్రాబాద్ (03225) మే 5 నుంచి జూలై 25 వరకు ప్రతి గురువారం, సికింద్రాబాద్ – దానాపూర్ (03226) ప్రత్యేక రైలు మే 5 నుంచి జూలై 28 వరకు ప్రతి ఆదివారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించింది. వీటితో పాటు సికింద్రాబాద్ – దానాపూర్ మధ్య మే నుంచి జూలై వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వివరించింది.