హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : ‘మిషన్ జీరో స్క్రాప్’ లక్ష్య సాధనలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో స్క్రాప్ విక్రయం ద్వారా రూ.411.39 కోట్ల ఆదాయం వచ్చిందని గురువారం ఎస్సీఆర్ అధికారులు తెలిపారు. 2022-23లో తుక్కు అమ్మకం ద్వారా రూ.391 కోట్లు రాగా, ఈ సారి మరో రూ.20.39 కోట్లు పెరిగిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ-వేలం ప్రక్రియ కొనుగోలుదార్ల మధ్య పారదర్శకత, వేలంలో పోటీతత్వాన్ని మెరుగుపరిచిందన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా కాగిత రహిత లావాదేవీలకు ఊతమిచ్చిందన్నారు. ఈ – వేలం విధానం మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడంతో పాటు పారదర్శకతను పెంచి కొనుగోలుదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను గణనీయంగా తగ్గించిందని పేర్కొన్నారు.