Adulterated Milk | యాదాద్రి భువనగిరి జిల్లాలో మరోసారి కల్తీపాల గుట్టు రట్టయ్యింది. కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు ఆదివారం నాడు భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల, గౌసుకొండ గ్రామాల్లో దాడులు చేశారు. కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 350 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ను స్వాధీనంచేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలోనూ అనేకసార్లు పోలీసులు దాడి చేసి కల్తీ పాల తయారీదారులను అరెస్టు చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ వీళ్లు తమ తీరు మార్చుకోవడం లేదు.
హైదరాబాద్కు అతి చేరువతోనే..
జిల్లాలోని భువనగిరి, బొమ్మలరామారం, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మండలాలు కల్తీ పాలకు అడ్డగా మారడానికి ప్రధానకారణం హైదరాబాద్కు అతి చేరువలో ఉండటం. రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకపోవడం, ఇకడ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతున్నది. కల్తీ పాలను హైదరాబాద్కు తరలించిన అనంతరం స్వీట్హౌజ్లు, హోటళ్లు, గృహ సముదాయలకు సైతం సరఫరా చేస్తుంటారు.
కల్తీ పాలతో నష్టాలివే..
కల్తీ పాల వల్ల చిన్నపిల్లలతో పాటు పెద్ద వారు కూడ అనారోగ్యానికి గురవుతారు. వీటిలో కలిపే యూరియా, కెమికల్స్, వంటనూనె వల్ల వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్, గ్యాస్, జీర్ణకోశ, సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. హైడ్రోజన్ ఫెరాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, సుక్రోజ్, నూనె, యూరియా, సర్ఫ్, బేకింగ్ సోడా, యూరియా, పాల పొడి లాంటి రసాయన పదార్థాలను వినియోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. అయితే కల్తీ పాలను దీర్ఘకాలంగా తాగడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్, కాలేయం, మెదడు సంబంధిత వ్యాధులతో పాటు ఇతర దుష్ప్రరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు పేరొంటున్నారు.