హైదరాబాద్, జూన్6 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీని పెద్ద ఎత్తున చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీచేసింది. గ్రూప్-1, పోలీసుశాఖకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా, ప్రభుత్వం ఇక వైద్యారోగ్యశాఖలోని ఖాళీలపై దృష్టి సారించింది. వైద్యారోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 12,755 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 10,028 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఇతర పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక, అరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
వారం వారం విడతల వారీగా ఆయా విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. ముందుగా వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీపీ, ఐపీఎం విభాగాల్లో మొత్తం 1326 పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు ద్వారా చేపట్టాలని మంత్రి సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ను రూపొందించాలని దిశినిర్దేశం చేశారు. మెడికల్ బోర్డు, ఆరోగ్యశాఖ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో హరీశ్రావు సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో సేవలందించిన ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగాల భర్తీలో 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని సూచించారు. ఆయుష్ విభాగంలోని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని ఆదేశించారు.
టెక్నికల్ పోస్టులతోపాటు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేయాలని, నిమ్స్లోని ఖాళీలను నిమ్స్ బోర్డు, మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీచేయాలని సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వంటి పోస్టులతోపాటు ఆయుష్ విభాగంలోని స్టాఫ్నర్సుల పోస్టులను కూడా మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 34, 35ను సవరించి నియామకాలు చేపట్టాలని చెప్పారు.
స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి మారుల ఆధారంగా ఎంపిక చేయాలని అన్నారు. 80 శాతం రాత పరీక్షకు మారులు, 20 మారులు కొవిడ్ కాలంలో పనిచేసిన వారికి వెయిటేజీ ఇవ్వాలని చెప్పారు. ఆయుష్ డాక్టర్స్ను టీచింగ్ స్టాఫ్గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తిచేసి, అందులో ఏర్పడే ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయాలని ఆదేశించారు. ఆయుష్ సర్వీసు రూల్స్లో సవరణలు చేయాలన్నారు. ప్రైవేట్ ప్రాక్టీస్ను రద్దు చేస్తూ సవరణలు చేయాలని మంత్రి వైద్యశాఖాధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్లో ఎంతమంది ఉన్నారు, ఏం పనిచేస్తున్నారు అన్న అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఎం డైరెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించారు.
సీనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లకు రూ.330 కోట్లను ైస్టెపెండ్గా ఇస్తున్నామని, వారి సేవలు చకగా వినియోగంచుకొనేలా విధివిధానాల రూపొందించాలని చెప్పారు. ప్రస్తుతం ఇచ్చే నోటిఫికేషన్లో ట్యూటర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి. ఎంబీబీఎస్ అర్హతగల ఈ పోస్టుల్లో ఔట్సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20 శాతం వేయిటేజి మారులు, మిగతా 80 శాతం వారు ఎంబీబీఎస్ డిగ్రీలో సాధించిన మారుల ఆధారంగా ఎంపిక చేయాలని తెలిపారు. మొదటి విడతగా 1326 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయాలని, ఆ వెనువెంటనే స్టాఫ్నర్సులకు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయాలని మంత్రి సూచించారు.
రెండు వారాల్లో నోటిఫికేషన్లు
ప్రస్తుతం పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందిందని, రెండు, మూడు వారాల్లో విడతల వారీగా నోటిఫికేషన్ల జారీ ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ ఈ సందర్భంగా తెలిపారు. సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్, డీఎంఇ రమేశ్రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్రావు, టివీవీపీ కమిషనర్ అజయ్కుమార్, కుటుంబ సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్వేత మహంతి, ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సెక్రెటరీ గోపీకాంత్రెడ్డి పాల్గొన్నారు.