పెద్దపల్లి: జిల్లాలోని అంతర్గాం మండలం లింగాపూర్లో వ్యక్తి హత్యకు గురయ్యాడు. కుటుంబ కలహాలతో కొడుకు చేతిలో తండ్రి చనిపోయాడు. గ్రామానికి చెందిన శనిగల రవి మద్యం తాగొచ్చి తరచూ భార్యతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా మద్యం మత్తులో భార్యతో ఉన్న రవి.. భార్యతో గొడవకు దిగాడు.
వారిద్దరిని సముదాయించేందుకు కొడుకు శివ ప్రయత్నం చేశాడు. అయితే చెప్పినప్పటికీ తండ్రి వినకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన శివ.. అతనిపై కత్తితో దాడిచేశాడు. దీంతో రవి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.