సత్తుపల్లి, మే 18: ఆస్తి కోసం నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని, కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లను ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో చోటుచేసుకున్నది. గోపాలపేటకు చెందిన పిట్టల పిచ్చమ్మ (60) తన రెండో సంతానమైన వెంకటేశ్వరరావు కుమార్తెలు నీరజ (10), ఝాన్సీమోహిని (5)తో కలిసి గ్రామంలో నివసిస్తున్నది. పెద్ద మనుమరాలు నీరజ స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతుండగా చిన్న మనుమరాలు ఝాన్సీమోహిని అంగన్వాడీ పాఠశాలకు వెళ్తున్నది. వెంకటేశ్వరరావు భార్య కనకదుర్గ రెండేండ్ల క్రితం మృతిచెందడంతో కూతుళ్లు ఇద్దరూ నానమ్మ వద్దే ఉంటూ చదువుకుంటున్నారు.
కోడలు చనిపోవడంతో పిచ్చమ్మ తనకున్న ఎకరం పొలంలో మనుమరాళ్లు నీరజ, ఝాన్సీమోహిని పేరుతో చెరో 10 గుంటలు రాసిచ్చింది. తాను 20 గుంటల భూమిని సాగు చేసుకుంటున్నది. వెంకటేశ్వరరావు తల్లాడకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఖమ్మంలో నివాసం ఉంటున్నాడు. తల్లి పేరుతో ఉన్న అరెకరం భూమి, రేకులషెడ్డును తన పేరుమీదకు మార్చుకోవాలని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తుండగా ఆమె అంగీకరించ లేదు. దీంతో తల్లి, పిల్లలను హతమార్చి ఆస్తి దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. ఖమ్మంలో ఉంటున్న వెంకటేశ్వరరావు గోపాల్పాటలోని తన తల్లికి ఫోన్ చేసి.. తాను శనివారం ఇంటికి వస్తున్నానని చెప్పాడు.
అర్ధరాత్రి దాటాక వెంకటేశ్వరరావు పిచ్చమ్మ, చిన్నారులు నిద్రిస్తున్న ఇంట్లోకి చొరబడి తల్లితోపాటు ఇద్దరు కూతుళ్లను హతమార్చి పరారయ్యాడు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వైరా ఏసీపీ రెహమాన్, సీఐ సాగర్, ఎస్సైలు వంశీకృష్ణ, భాగ్యరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ట్రాక్టర్లో పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రెండేండ్ల క్రితం వెంకటేశ్వరరావు భార్య కనకదుర్గను కూడా హత్య చేయడంతో పెద్దమనుషుల సమక్షంలో ఆస్తి పంపకాలు చేసినట్టు గ్రామస్థులు పోలీసులకు వివరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న వెంకటేశ్వరరావు కోసం గాలిస్తున్నారు.