నల్లగొండ : రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎదుటి వారిపై కేవలం విమర్శలు చేయడం, తిట్టడం ద్వారా గొప్పదనం వస్తుందని భావిస్తున్నాయని, ఇది సరైనది కాదని అభిప్రాయపడ్డారు.
దేశంలో, ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆధ్వర్యంలో అమలవుతున్నాయని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అత్యంత ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు.దేశంలోని యావత్ రైతాంగం కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందని అన్నారు.
శాంతి భద్రత పరిరక్షణలోనూ తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు. హైదరాబాదుకు పరిశ్రమలు, ఐటీ, కంపెనీలు రావడానికి మంత్రి కేటీఆర్ (Minister KTR ) కృషి అభినందనీయమని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయని వెల్లడించారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్,మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.