అమరావతి : తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka ) కుటుంబ సమేతంగా తిరుమల (Tirumala)ను దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం తిరుమల ఆలయ ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆరు గ్యారెంటీలో మరికొన్నింటినీ అమలు చేయనున్నామని , పార్టీ పరంగా ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలలో రెండు పథకాలను ప్రారంభించామని అన్నారు. టీఎస్ ఆర్టీసీ బస్లో మహిళలకు మహాలక్ష్మి పేరిట ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10లక్షల వరకు సహయం పెంపును ప్రారంభించామని వెల్లడించారు.
ఎన్నికల సందర్భంగా నిలిచిపోయిన రైతు బంధు నిధులను మంగళవారం నుంచి విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రైతు భరోసాపై చర్చించి నిర్ణయం తీసకోనున్నామని భట్టి తెలిపారు. రాష్ట్ర ఆర్థికమంత్రి, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించినందున ఆర్థిక వనరులు, ఆర్థిక వనరుల పెంపుదల చేయాలని, తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందేలా ఆశీర్వదించాలని స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడించారు.