విద్యానగర్, జనవరి 26: న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించాలని డిస్ట్రిబ్యూటర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఏజెంట్కు ఎలక్ట్రిక్ బైక్ను సబ్సిడీపై అందించాలని, ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్లు శుక్రవారం కరీంనగర్లోని ఓ బంకెట్ హాల్లో సమావేశమై సమస్యలపై చర్చించారు.
మహారాష్ట్రలో ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లకు అమలవుతున్న పథకాలన్నీ తెలంగాణలో అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి కూడలి రాంప్రసాదరావు, కోశాధికారి ఉప్పు రాజేందర్, కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు పెద్ది లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి పచ్చునూరి రాజేందర్, కోశాధికారి సాయి కృష్ణ, రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, 500 మందికిపైగా డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.