హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం సనత్ నగర్ లోని సివిటాస్ అపార్ట్మెంట్ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలను సమానంగా భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు.
కాలనీలోని యువకులు ప్రతి ఒక్కరూ ఓటరు నమోదులో పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సనత్ నగర్ మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్ వరకు ఉన్న మంజూరైన సీసీ రోడ్డు పనులు త్వరలో ప్రారంభం అవుతాయని చెప్పారు. కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.
సనత్ నగర్ ఇండస్ట్రీ ప్రాంతం నుంచి బాలానగర్ సర్కిల్ వరకు అండర్ పాస్, ఫతే నగర్ ప్లై ఓవర్ విస్తరణ పనుల కోసం రూ. వంద కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిరా, హరికల్చర్ డీడీ శ్రీనివాస్, సీఐ ముత్తు యాదవ్, అపార్టుమెంట్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.