బోయినపల్లి, జూన్ 14 : రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు సమష్టిగా కూర్చుని మాట్లాడితే రేషనలైజేషన్ సమస్య పరిష్కారమవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ సర్పంచ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి ప్రేమ్సాగర్ తన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్య ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వినోద్కుమార్ పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా విధ్యాధికారి రాధాకిషన్, జడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు వచ్చి పాఠశాలల సమస్యలు, విద్యార్థుల సంఖ్యను వివరించారు. జిల్లాలో ఎన్ని జడ్పీ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య, ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని డీఈవోను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో 339 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 111 జడ్పీ పాఠశాలలు ఉన్నాయని, 120 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అయితే, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలు కూడా ఉన్నాయని తెలిపారు.
రేషనలైజేషన్ అనేది పెద్ద సమస్య అని, విజ్ఞులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే సమస్య ఏ విధంగా పరిష్కారమవుతుందని, ఈ విషయమై రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవ సేనను అడిగినట్లు చెప్పారు.
అందుకు ఆమె వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట ఉపాధ్యాయులు పని చేయాలని రాష్ట్రంలోని అన్ని డీఈవో కార్యాలయాలకు ఉత్వర్వులు జారీ చేసినట్లు చెప్పారని తెలిపారు.
జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులు కూడా మానవతా దృక్పథంతో అదే పాఠశాలలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా బోధన చేయాలని, ఆ విద్యార్థులు మళ్లీ అదే జడ్పీ పాఠశాలకు వస్తారని వినోద్కుమార్ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ను తీర్చి దిద్దే ఉపాధ్యాయులు పునరాలోచించాలని కోరారు.