Dharani | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): కౌలుదారులకు పెట్టుబడి సాయం అందించడం ప్రస్తుతానికి కష్టమేనని ధరణి కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. వివిధ శాఖలకు చెందిన భూముల నమోదు, సమాచారం, రైతుల ఇబ్బందులపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర సచివాలయంలో అటవీ, గిరిజన సంక్షేమం, వ్యవసాయశాఖలతో ధరణి కమిటీ సభ్యులు శనివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో 6.68 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందించినప్పటికీ పలు లోపాలతో ధరణిలో నమోదు కాకపోవడంతో, గిరిజన సంక్షేమశాఖ ఇచ్చే సమాచారం మేరకే వ్యవసాయశాఖ రైతుబంధు ఇస్తున్నదని పేర్కొన్నారు.
గిరిజనులు భూములకు పట్టాలు పొందలేకపోతున్నారని, వారసత్వంగా బదిలీ కావాల్సిన భూములు కూడా వారికి రావడం లేదని అధికారులు తెలిపారు. గిరిజనుల భూముల్లో సర్వే చేపడితేనే హకులపై స్పష్టత వస్తుందని అన్నారు. అటవీశాఖ పరిధిలోని భూములకు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి మధ్య తేడాలు ఉన్నాయని తెలిపారు. కౌలు రైతుల గుర్తింపు విధానం లేదని పేరొంది. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.