హైదరాబాద్ : రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి(Solipeta Ramachandra Reddy (92) మంగళవారం ఉదయం హైదరాబాద్లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని బంజారాహిల్స్ శాసనసభ్యుల నివాసం 272 (ఏ)లో ఉంచారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. సిటీ కాలేజీలో పట్టభద్రులైన రామచంద్ర రెడ్డి రాజకీయాల్లో పూర్తి కాలం పనిచేశారు. స్వగ్రామం చిట్టాపూర్ సర్పంచ్ గా, దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, అప్పటి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, దొమ్మాట శాసనసభ్యుని(MLA)గా సేవలందించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా(MP), రాజ్యసభలో ఆ పార్టీ నాయకులుగా, రాజ్యసభ హామీల అమలు స్థాయి సంఘం సభ్యులుగా, పలు హోదాల్లో సేవలు అందించారు.
ఇటీవలి కాలంలోనూ భారత చైనా మిత్రమండలికి అధ్యక్షులుగా, సీఆర్. ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు వంటి సంస్థలకు సభ్యులుగా సేవలందించారు. లోక్సత్తా లో కూడా కొంతకాలం కలిసి పని చేశారు. రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి చిన్న కుమార్తెను తమ పెద్ద కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డికి చేసుకున్నారు.
సోలిపేట మరణం పట్ల సీఎం కేసీఆర్తో పాటు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు,రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.