గీసుగొండ, అక్టోబర్ 30: జాతీయ ఉత్తమ గ్రామం మరియపురం మరో అద్భుతం సృష్టించింది. ప్రభుత్వాలు నిధులిస్తేనే అభివృద్ధి చేయడం కాదు, స్వశక్తితో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకుసాగుతున్నారు వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి. ఆయన ప్రత్యేక చొరవతో గ్రామ రూపురేఖలనే మార్చేస్తున్నారు. ఈ క్రమంలో మరియపురం గ్రామాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన గ్రామాల సరసన నిలుపడంతో గత ఏడాది కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ పంచాయతీ అవార్డును దక్కించుకొన్నది. ఇదిలావుంటే సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా ఈ పంచాయతీ మరో రికార్డు వైపు దూసుకుపోతున్నది.
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 7 విద్యుత్తు మీటర్లు ఉన్నాయి. వాటికి ప్రతినెలా జీపీ తరఫున రూ.పది వేల నుంచి రూ.12 వేల వరకు కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. గ్రామంలో విద్యుత్తు వినియోగం అధికం కావటంతోపాటు బిల్లు లు చెల్లించటం పంచాయతీకి భారంగా మారింది. దీంతో రూ.4.50 లక్షల సొంత ఖర్చులతో సర్పంచ్ బాలిరెడ్డి ఆదివారం గ్రామంలో రెండు సోలార్ గ్రిడ్లను ఏర్పాటు చేశారు. ఈ గ్రిడ్ ద్వారా 6 కేవీ విద్యు త్తు ఉత్పత్తి అవుతున్నది. జీపీ పరిధిలోని వీధిలైట్లు, వాటర్ ప్లాంట్తోపాటు జీపీ ఆధర్యంలో నడుస్తున్న మీటర్లకు సోలార్ గ్రిడ్ ద్వారా విద్యుత్తు సరఫరా అవుతున్నది. దీంతో జీపీకి ప్రతి నెలా కరెంటు బిల్లుల భారం తప్పింది. సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే 6 కేవీ విద్యుత్తులో 1కేవీ విద్యుత్తును విక్రయించుకునే అవకాశం కలిగింది. గ్రామంలో విద్యుత్తు ఉత్పత్తి చేయటం వల్ల లోవోల్టేజీ సమస్య తీరింది.
సొంత నిధులతో సోలార్ గ్రిడ్
రూ.4.50 లక్షల సొంత ఖర్చుతో గ్రామంలో రెండు సోలార్ గ్రిడ్లను ఏర్పాటు చేశాను. ఈ గ్రిడ్ నిర్వహణ బాధ్యత ఐదేండ్లపాటు కంపెనీదే. ఏ సమస్య వచ్చినా ఉచితంగా మరమ్మతులు చేస్తది. సోలార్ గ్రిడ్ వల్ల పంచాయతీ నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించే పనిలేక పోవడంతో డబ్బులు ఆదా అవుతున్నాయి.
– అల్లం బాలిరెడ్డి, సర్పంచ్, మరియపురం