హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణాధారమని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. కోయంబత్తూరుకు చెందిన ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్లో ఎంపీ సంతోష్ను కలిసి, సద్గురు చేపట్టిన సేవ్ సాయిల్ ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ.. మట్టికి-మొక్కకు అవినాభావ సంబంధం ఉన్నట్టే, ఈశా ఫౌండేషన్ ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి, తాము చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఉద్యమానికి అదే సంబంధం ఉన్నదని చెప్పారు. మట్టిని కాపాడుకొందాం-మొక్కను బతికించుకొందాం అని పిలుపునిచ్చారు. సేవ్ సాయిల్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
భూమిపై పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ‘హరా హైతో భరా హై’ నినాదంతో 2018 జూలై 17న తాము ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం నేడు గొప్ప విప్లవంగా మారిందని, అనుకొన్న లక్ష్యాన్ని చేరిందని వెల్లడించారు. ఈశా ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రతినిధులు ఎంపీ సంతోష్కు వివరించారు. సేవ్సాయిల్ ఉద్యమంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు విజయవంతమయ్యాయని, ప్రస్తుతం ప్రపంచ యాత్ర సాగుతున్నదని తెలిపారు. త్వరలో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఈశా ఫౌండేషన్ ఏర్పాటు చేయబోయే సేవ్ సాయిల్ ఉద్యమ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించగా, తప్పకుండా హాజరవుతానని ఎంపీ సంతోష్ హామీ ఇచ్చారు.
ఎంపీ సంతోష్కు ప్రపంచ పర్యావరణవేత్త అభినందన
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ ప్రకృతి ప్రేమను నార్వే మాజీ మంత్రి, ప్రపంచ పర్యావరణ వేత్త ఎరిక్ సోల్హెమ్ అభినందించారు. ఇటీవల గ్రీన్ ఇండియా చాలెంజ్, వట ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రాన్స్లొకేషన్ విధానంలో వందేండ్ల నాటి వృక్షాలను మహబూబ్నగర్ జిల్లాలోని కేసీఆర్ అర్బన్ పార్కులో రీలొకేట్ చేశారు. దీన్ని ఎంపీ సంతోష్కుమార్ ట్వీట్ చేయగా, ‘ప్రకృతి మాతకు ఎలాంటి నష్టం కలగకుండా జరుగుతున్న అభివృద్ధి. 4 వందేండ్ల వేప చెట్లను ట్రాన్స్లొకేట్ విధానంతో కేసీఆర్-ఎకో పార్కులో రీ లొకేట్ చేసినందుకు అభినందన’ అని ఎరిక్ సోల్హెమ్ రీట్వీట్ చేశారు.