Cyber Fraud | ధర్మపురి : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య జనమే కాకుండా.. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం కేటగాళ్ల బారినపడుతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. బురిడీ కొట్టించి ఖాతాల్లో నుంచి సొత్తును లూటీ చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ సాఫ్ట్ ఇంజినీర్ టెలీగ్రామ్ యాప్ ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ ప్రకటనను పంపాడు. దానికి స్పందించిన సదరు ఇంజినీర్ ఖాతా నుంచి రూ.6,63,888లు ఊడ్చేశారు. దాంతో సదరు వ్యక్తి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి పట్టణానికి చెందిన వేముల ప్రశాంత్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. వాట్సాప్, టెలీగ్రామ్లకు గూగుల్ రివ్యూవల్గా పార్ట్టైమ్ జాబ్ చేస్తే డబ్బులు వస్తాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రకటనను పంపాడు. దాన్ని చూసిన ప్రశాంత్ ఆ లింక్ను ఓపెన్ చేసి చూశాడు. గూగుల్ మ్యాప్ రేటింగ్ పేరుతో మొదట రూ.150 పంపాలని మెస్సేజ్ వచ్చింది. దాంతో స్పందించిన ప్రశాంత్ రూ.150 పంపగా.. వెంటనే అతని ఖాతాలో రూ.300 జమయ్యాయి. ఆ తర్వాత రూ.2వేలు పంపగా.. తిరిగి రూ.3వేలు జమయ్యాయి. ఇలా ఎక్కువ మొత్తంలో పంపిస్తే.. ఎక్కువ మొత్తంలో వస్తాయని.. దానికి రూ.6,63,888 పంపితే రెట్టింపు కంటే ఎక్కువ డబ్బలు జమయవుతాయని నమ్మబలికాడు.
పలుమార్లు పంపినదాని కంటే ఎక్కువగా డబ్బులు రావడంతో నమ్మిన ప్రశాంత్.. సదరు వ్యక్తి కోరినట్లుగా రూ.6,63,888 పంపాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బులు తిరిగి రాలేదు. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో, మొబైల్స్, మెయిల్స్కు వచ్చే మోసపూరిత ప్రకటలను చూసి గుర్తు తెలియని నంబర్లకు డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారినపడి డబ్బులు పోగొట్టుకుంటే 1930 నంబర్కు కాల్ చేయాలని సూచించారు.