(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై రేవంత్ సర్కార్ సాగించిన దమనకాండపై సోషల్మీడియా వేదికగా నెటిజన్లు భగ్గుమంటున్నారు. మహిళా నేతలపై దాడులు చేయడం ఏందని కాంగ్రెస్ ప్రభుత్వంపై వేలాది పోస్టులతో దుమ్మెత్తిపోస్తున్నారు. ‘గతంలో మీ పార్టీలో మంత్రులుగా పనిచేసిన మహిళలకు.. ఇప్పుడు రేవంత్ ఇస్తున్న గౌరవాన్ని చూస్తున్నారా? రాహుల్ జీ.. ప్రియాంకా జీ?’ అంటూ ఎంజీఎం అనే నెటిజన్ ప్రశ్నించారు.
మహిళా ప్రజాప్రతినిధులపై ఇలాంటి దాడులు జరుగుతుంటే మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తున్నాయని కామన్ మ్యాన్ పేరిట ఓ నెటిజన్ ట్వీట్చేశారు. మాజీ మంత్రులు అందులోనూ మహిళలు అని కూడా చూడకుండా ఇలా చేయడం ఏమిటని? కేఎస్ శర్మ అనే నెటిజన్ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘సజ్జనార్ సార్.. ఇదేనా మీ పోలీసింగ్?’ అంటూ మోహన్నాయక్ అనే నెటిజన్ ప్రశ్నించారు. ఈ ఘటనతో కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది చివరినాటికి కూలిపోవడం ఖాయమని చికెన్ కీవ్ పేరిట ఓ నెటిజన్ జోస్యం చెప్పారు.