రూల్స్ పేరుతో రాష్ర్టాల అధికారాలకు కేంద్రం కత్తెర
సోషల్ మీడియాపై నియంత్రణ తన ఆధీనంలోకి
తాను కనికరిస్తేనే ‘సైబర్’ దర్యాప్తులు ముందుకు
శాంతి భద్రతలకు విఘాతంగా కొత్త నిబంధనలు
సోషల్ మీడియాపై నియంత్రణ.. కాదు.. రాష్ర్టాల అధికారాలకు కత్తెర
ఇంటర్మీడియేటరీ గైడ్లైన్స్ కాదు.. శాంతి భద్రతల డిస్ట్రక్టర్స్
రాష్ర్టాలన్నీ బాంఛన్ అనాలె.. మోదీ సర్కారు చెప్పింది వినాలె..
ఇదీ.. బీజేపీ రాసిన ‘సోషల్ మీడియా’ రాజ్యాంగం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 : సోషల్ మీడియాపై నియంత్రణకు కేం ద్రం ప్రభుత్వం ‘ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ ఎథిక్స్ కోడ్’ పేరుతో నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధనలు బీజేపీకి, కేంద్రంలోని బీజే పీ ప్రభుత్వానికి తప్ప.. దేశంలోని ఏ ఒక్క సామాన్యుడికీ ఉపయోగపడేవి కావు. అసలు ఈ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండానే, కనీస సమాచారం ఇవ్వకుండానే రూపొందించింది. మార్గదర్శకాల పేరుతో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ పూర్తి అధికారాలను తన చేతుల్లోకి తీసుకొన్నది. గైడ్లైన్స్ ప్రకారం.. తమ ప్లాట్ఫామ్లలో ప్రచురించిన మొత్తం కంటెంట్కు సోషల్ మీడియా సంస్థలే జవాబుదారీగా ఉండాలి. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, సమ్మతి నివేదిక, అభ్యంతరకర కంటెంట్ పర్యవేక్షణ-తొలగింపు చేపట్టాలి. దానికోసం భారత్ లో ప్రత్యేకంగా సంస్థల అధికారులు ఉండాలి. శాంతి భద్రతల సమస్యలు, మతకలహాలు తదితర సున్నితమైన అంశాలకు సంబంధించి దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే అభ్యర్థలనతో వెంటనే ఆయా అంశాలను డిలీట్ చేసి,బాధ్యుల వివరాలను దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలి.
ఇంటిర్మీడియరీ గైడ్లైన్స్ ఇవీ..
* దర్యాప్తు సంస్థలతో సమన్వయం కోసం వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ తదితర సోషల్మీడియా ప్లాట్ఫామ్స్, నెట్ప్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ యజమాన్యాలు తప్పనిసరిగా భారత్లో ప్రత్యేక ప్రతినిధులను నియమించాలి. ఇందులో భాగంగానే రాష్ర్టానికో నోడల్ అధికారి ఉండాలి.
* వివాదాస్పమైన పోస్టులకు సంబంధించిన సమచారాన్ని మొదట రూపొందించిన వ్యక్తి ఎవరు అనే విషయాన్ని గుర్తించి 24 గంటల్లోనే గుర్తించి, ఆ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అడిగినప్పుడు ఇచ్చి, ఆ ఖాతాను వెంటనే తొలగించాలి.
* దేశ రక్షణ, సమాజంలో శాంతి భద్రతలను దెబ్బతీసే వివాదాస్పద పోస్టులు పెట్టినవారి వివరాలు ప్రభుత్వానికి, కోర్టులు కోరితే వెంటనే అందించాలి. దేశ సౌర్వభౌమత్వానికి, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే ఏదైనా సమాచారాన్ని తొలగించాలని కేంద్రం ఆదేశిస్తే తక్షణమే అమలు చేయాలి.
* మహిళల గౌరవాన్ని దెబ్బతీసే సమాచారం, లైంగిక దృశ్యాలు, మార్ఫింగ్ ఫోటోలు, నగ్న చిత్రాల విషయంలో ఫిర్యాదు అందిన 24 గంటల్లో దర్యాప్తు సంస్థలు అడిగిన సమాచారం ఇవ్వాలి.
* వినియోగదారులు, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం భారత్లోనే ఉండేలా ఆయా సంస్థలు తమ అధికారులను నియమించాలి. ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలను నెల రోజుల్లో నివేదిక రూపొందించి కేంద్రానికి అందజేయాలి, వినియోగదారుల ఫిర్యాదులపై 15 రోజుల్లోగా స్పందించాలి.
* వార్తలు, వార్త కథనాలను అందించే డిజిటల్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన యజమాన్యాల వివరాలు స్పష్టంగా వెల్లడించాలి.
తిరకాసు ఇక్కడే..
అభ్యంతర పోస్టులు పెట్టే వారి వివరాలు ఇవ్వాలని దర్యాప్తు సంస్థలు కూడా కోరవచ్చు. ఆ అభ్యర్థనలను ఆయా సంస్థలు పట్టించుకోకపోతే రాష్ట్రంలో ఉండే నోడల్ అధికారి ద్వారా కేంద్రానికి అభ్యర్థన పంపించాలి. కేంద్రం ఏం చేస్తుంది? అదే.. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫిర్యాదు చేసింది బీజేపీవాళ్లా? వేరే వాళ్లా? ఆ ఫిర్యాదు బీజేపీపైనా? లేక ప్రతిపక్షాలపైనా? అని ఓ లుక్కేస్తుంది. బీజేపీకి, బీజేపీ మద్దతుదారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు అందితే ఉద్దేశపూర్వకంగా ఆ అభ్యర్థనలు తొక్కిపడేస్తుంది.
గతంలో అలా.. ఇప్పుడిలా..
గతంలో ఏదైనా సమస్య వస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సోషల్ మీడియా సంస్థలకు అభ్యర్థన పెట్టగానే వాటిని తొలగించేవి. ఇప్పుడు సోషల్మీడియా సంస్థలు అసలేం పట్టించుకోవటం లేదు. అప్పట్లో రాష్ర్టాలకు కూడా అధికారులు ఉన్నాయి. సోషల్ మీడియా సంస్థలకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలంటే గౌరవం, భయం ఉండేది. ఇప్పుడు రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు సోషల్మీడియాపై ఎలాంటి అధికారాలు లేవు. ఏదైనా ప్రశ్నించాలంటే కేంద్రం ద్వారానే రావాలనే నిబంధన పెట్టడమే దీనికి కారణం. ఫలితంగా వివిధ సోషల్మీడియా ప్లాట్ఫామ్స్పై వచ్చిన పోస్టులను తొలగించాలంటూ దర్యాప్తు సంస్థలు పెట్టిన అభ్యర్థనలు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి.
శాంతి భద్రతలు అదుపు తప్పితే!
శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటాయి. అయితే, సోషల్ మీడియాలో జరిగే వివాదాలతో శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. మూడేండ్ల కిందట ఆదిలాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదానికి సోషల్మీడియానే ఆజ్యం పోసింది. సోషల్మీడియాలో పుకార్లను గుర్తించిన దర్యాప్తు సంస్థలు వేగంగా స్పందించి గంటల వ్యవధిలోనే ఆయా పోస్టులను తొలగించి, సమస్యలను పోలీసులు పరిష్కరించారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థల నుంచి నోడల్ అధికారికి, అక్కడి నుంచి కేంద్రానికి చేరి.. సంస్థలకు ఆదేశాలు చేరే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
బీజేపీకి కావాల్సిందిదే..
కేంద్రంలో అధికారం బీజేపీది. రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంటే సున్నితమైన అంశాలపై వెంటనే చర్యలు తీసుకొంటున్నది. అదే.. వేరే పార్టీ అధికారంలో ఉంటే కేంద్రం ఆ విషయాన్ని అంతగా పట్టించుకోదు. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తితే తమకేంటి? అన్నట్లుగా ఆ విషయాన్ని వదిలేస్తున్నది. దీంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తి ప్రాణ, ఆస్తి నష్టాలు కూడా జరిగే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన స్వార్థం కోసం తీసుకొచ్చిన ఈ నిబంధనలు అశాంతికి మూలంగా మారే ప్రమాదం ఉన్నది.
కేంద్రం ద్వారానే రావాలి
గతేడాది సోషల్మీడియా, ఓటీటీలకు నోడల్ అధికారులను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. దర్యాప్తు సంస్థలు అడిగిన సమాచారాన్ని అవి ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో అడిగిన సమాచారాన్ని ఆయా సంస్థలు ఇవ్వవు. అలాంటప్పుడు కోర్టు ద్వారా కానీ, కేంద్రం ద్వారా కానీ ఆయా సంస్థను ఆశ్రయించాల్సి వస్తున్నది. సోషల్ మీడియా సంస్థలు వ్యాపారమే లక్ష్యంగా ముందుకెళ్తుంటాయి. కేంద్రం చెప్పినట్టు చేస్తే ఎలాంటి ఇబ్బందులుండవనే భావనలో ఆయా సంస్థలున్నాయి.
-ల్లమో నతు శ్రీధర్, ఐటీ విశ్లేషకుడు
అప్పుడు మీడియా.. ఇప్పుడు సోషల్ మీడియా
సోషల్మీడియాను అడ్డుపెట్టుకొని కేంద్రం చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. మహిళా జర్నలిస్టు స్వాతి చతుర్వేదిపై ఆమె ప్రత్యర్థులు సోషల్మీడియాలో ఎన్నో అభ్యంతరక పోస్టులు పెట్టారు. ఆమె ఫిర్యాదు చేస్తే దర్యాప్తు సంస్థలకు అభ్యంతరకర పోస్టులు చేసినవారి వివరాలు కూడా ఇవ్వలేదు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్లపై నకిలీ ఖాతాలతో విరుచుపడుతారు. అన్ని సోషల్మీడియా సంస్థలను కేంద్రం లొంగదీసుకొన్నది.
– సతీష్రెడ్డి, టీఆర్ఎస్ ఐటీ సెల్ కన్వీనర్