మనిషి పుట్టుక ఓ సంబురం.. అది నిజంగా సంబురం కావాలంటే కుటుంబానికి మంచి వసతులు, వనరులు ఉండాలి. మనిషి జీవితం నిత్య పోరాటం. అందులో గెలువాలంటే గొప్ప ప్రభుత్వం ఉండాలి. ప్రజలను కండ్లల్లో పెట్టుకొని కాపాడుకొనే పాలకులు ఉండాలి. మనిషి చివరి మజిలీ ఓ జ్ఞాపకం. అది గౌరవంగా, కలకాలం అయినవారికి గుర్తుండిపోయేలా ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుసాధ్యమయ్యాయి. సెంటర్ ఫర్ ఎకనమిక్ స్టడీస్ (సెస్), ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా లోతైన అధ్యయనం నిర్వహించి తేల్చిన సత్యమిది.
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రతను కల్పించటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచింది. విద్య, వైద్యం, ఆర్థిక భద్రత, శాంతిభద్రతలు తదితర విషయాల్లో దేశంలోని అన్ని పెద్దరాష్ర్టాలను వెనక్కు నెట్టింది. సెంటర్ ఫర్ ఎకనమిక్ స్టడీస్ (సెస్), ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అనేక అంశాల్లో తెలంగాణ అత్యుత్తమ ర్యాంకులు సొంతం చేసుకొన్నది. ‘యాక్సెస్ (ఇన్)ఈక్వాలిటీ ఇండెక్స్’ పేరుతో వెలువరించిన నివేదికలో సామాజిక, ఆర్థిక భద్రతలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ప్రజలకు కనీస సదుపాయాల కల్పనలో ఆరో స్థానం దక్కించుకొన్నది. అందరికీ విద్యను చేరువ చేయడంలో ఏడో స్థానంలో నిలిచింది. సెకండరీ విద్యతో పాటు, విద్యా వసతుల కల్పనలో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. శాంతిభద్రతలు కాపాడటం, సత్వర న్యాయం అందించడంలో 9వ స్థానంలో నిలిచింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్తోపాటు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ వంటి పెద్ద రాష్ర్టాలన్నీ తెలంగాణకు దిగువనే ఉండటం విశేషం.
ఇతర సౌకర్యాలు తెలంగాణలో భేష్
తాగునీరు, పారిశుద్ధ్యం, గృహవసతి, క్లీన్ఎనర్జీ, న్యూట్రిషన్, డిజిటల్ యాక్సెస్ అంశాల్లో అభివృద్ధివైపు పరుగులు తీస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ప్రధాన రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ కంటే ముందు పంజాబ్, సిక్కిం, హర్యానా, మిజోరం, గుజరాత్, మహారాష్ట్ర మాత్రమే ఉన్నాయి. దేశంలో సగటున 65.9 శాతం ఇండ్లలోనే తాగునీటి వసతి ఉన్నది. మన రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో గోవా, పంజాబ్, తెలంగాణ, హర్యానా, కేరళ, సిక్కిం రాష్ర్టాలు ముందు వరుసలో నిలిచాయి.