హైదరాబాద్ : ఇప్పటికైతే పగలంతా ఉక్కపోతకు గురవుతూ.. రాత్రంతా చలితో వణికిపోతున్నారు ప్రజలు. పగటిపూట పలు ప్రాంతాల్లో ఎండ దంచికొడుతోంది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఎండలు మండిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదివారం(ఫిబ్రవరి 20) రోజు 34.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయని, మరి కొద్ది రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు.
రాత్రి సమయాల్లో సగటున 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాది హైదరాబాద్లో ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో గరిష్టంగా 34 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఆదివారం రోజు ఖమ్మం, నిర్మల్ జిల్లాల్లో అత్యధికంగా 37.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ములుగు, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రాబోయే రోజుల్లో 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.