దుబ్బాక, డిసెంబర్ 2: చిట్టాపూర్ ఘటనలో గజ ఈతగాడి మరణానికి ఎమ్మెల్యేనే కారణమంటూ దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన మృతుడి బంధువులు, గ్రామస్థులు గురువారం చిట్టాపూర్ శివారులో రహదారిపై ఆందోళనకు దిగారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ శివారులో వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లడంతో మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకులు లక్ష్మి, అంబటి ప్రశాంత్ మృతి చెందారు. బావిలో పడిన కారుతోపాటు మృతదేహాలను బయటకుతీసేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్న దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన నర్సింలు సైతం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్రావు కారణమంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గురువారం మధ్యాహ్నం చిట్టాపూర్ శివారులో రహదారిపై మృతదేహంతో ధర్నాకు దిగారు. బావిలో మృతదేహాలను వెతికేందుకు బుధవారం మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 6.30 వరకు గజ ఈతగాళ్లతో ప్రయత్నించినా జాడ తెలియరాలేదని, చీకటి పడటంతో తనవల్ల కాదని నర్సింలు బయటకు వచ్చారు. ఎమ్మెల్యే బలవంతంగా మళ్లీ అతడిని బావిలోకి దింపారని ఆరోపించారు. నీటిని తోడేసి మృతదేహాలు తీసే అవకాశమున్నా ఎమ్మెల్యే అత్యుత్సాహానికి నర్సింలు బలైనట్టు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింలు కొనఊపిరితో ఉన్నా రక్షించే చర్యలు తీసుకోకపోగా అక్కడి నుంచి ఎమ్మెల్యే పారిపోయాడని వారు మండిపడ్డారు. సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడి కుటుంబీకులకు రూ.11 లక్షలు (మత్స్యశాఖ నుంచి రూ.5 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ.6 లక్షలు), మృతుడి భార్య లతకు ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. గజ్వేల్ ఏసీపీ రమేశ్, సిద్దిపేట అదనపు డీసీపీలు శ్రీనివాసులు, సుభాశ్చంద్రబోస్ తదితరుల హామీతో వారు ఆందోళన విరమించారు.
ఎనగుర్తిలో బీజేపీ జెండా గద్దె ధ్వంసం
నర్సింలు మృతితో ఆగ్రహించిన ఎనగుర్తి వాసులు గ్రామంలో బీజేపీ జెండా గద్దెను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే రఘునందన్రావు కండ్ల ఎదుటే నర్సింలు మృతి చెందితే.. స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటివరకు కనీసం ఫోన్ కూడా చేయకపోవడం బాధాకరమని పలువురు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ గ్రామంలో బీజేపీ జెండా గద్దెను కూల్చేసినట్టు వారు పేర్కొన్నారు.