హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 3,801 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాలతో ఒకరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 38 వేలు దాటింది. రికవరీ రేటు 94.37 శాతానికి తగ్గింది. మరోవైపు 2,046 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,570, మేడ్చల్ మల్కాజిగిరిలో 254, రంగారెడ్డిలో 284, హనుమకొండలో 147, ఖమ్మంలో 139 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1.89 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 31వేల మందికి మొదటిడోస్, 1.53 లక్షల మందికి రెండో డోస్, దాదాపు 4వేల మందికి బూస్టర్ డోస్ వేశారు. 15-18 ఏండ్ల వారికి ఇప్పటివరకు 62 శాతం మందికి మొదటి డోస్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26.83 లక్షల డోసులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 53,311 పడకలు అందుబాటులో ఉన్నాయి.