న్యూఢిల్లీ, జనవరి 10: మోదీ సర్కార్కు వ్యతిరేకంగా రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) సమరభేరి మోగించింది. లోక్సభ-2024 ఎన్నికల్లో మో దీ సర్కార్ ఓటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘జన జాగరణ్’ ప్రచార ఉద్యమాన్ని చేపడుతున్నట్టు ఎస్కేఎం ప్రకటించింది. జనవరి 10 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి రైతాంగ సంక్షోభం, మోదీ సర్కార్ కార్పొరేట్ అనుకూల విధానాలపై అవగాహన కల్పిస్తామని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
దేశంలోని 30.4 కోట్ల కుటుంబాల్లో కనీసం 40 శాతం కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకోవాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నది. దేశంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానాల్ని వివరిస్తూ ప్రచార సమాచారాన్ని అన్ని భాషల్లో రూపొందించామని, దేశంలో నేడు రైతులు, వ్యవసాయ కూలీలు, యువత ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరిస్తామని ఎస్కేఎం తెలిపింది. రైతులు, రైతు కూలీల ఆలిండియా సద స్సు(2023) తీర్మానంలోని డిమాండ్లకు మద్దతు సేకరించటం ప్రచార ఉద్యమం లక్ష్యమని ఎస్కేఎం నాయకులు తెలిపారు.
గ్రామా లు, పట్టణాల్లో కరపత్రాలు, నోటీసులు అతికిస్తామని, మోదీ సర్కార్ కార్పొరేట్ అనుకూల విధానంలో లోపాల్ని బహిర్గతం చేస్తామని వివరించారు. ఇదిలా ఉండగా, జన జాగరణ్ ఉద్యమానికి కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. జిల్లా కేంద్రాల్లో జనవరి 26న తలపెట్టిన ట్రాక్టర్ పరేడ్ ర్యాలీలో రైతులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎస్కేఎం ఈ సందర్భంగా కోరింది.