హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘లెర్నింగ్ బై డూయింగ్’ అన్నది నేటి విద్యావిధానం అనుసరిస్తున్న సరికొత్త సూత్రం. పుస్తకాల్లోని పాఠ్యాంశాలను అవపోసన పట్టినా రాని నైపుణ్యతలు క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారా పొందవచ్చు. దీని ప్రకారం ఇంటర్ విద్య కమిషనరేట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకొన్నారు. వొకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీలను ప్రొడక్షన్ అండ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చారు. రాష్ట్రంలోని హనుమకొండ, నల్లగొండ, మహబూబ్నగర్, నాంపల్లి, కూకట్పల్లి, ఫలక్నుమాలోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ల నిర్వహణకు మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థులతో పాటు పదో తరగతి పూర్తిచేసి డ్రాపౌట్ అయిన వారు కూడా ఈ సెంటర్లు నిర్వహించే కోర్సుల్లో చేరొచ్చని అధికారులు తెలిపారు.