హైదరాబాద్, అక్టోబరు 16 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: ఊళ్లకు ఊళ్లే గులాబీ పార్టీ బాటపడుతున్నాయి. టీఆర్ఎస్లోకి వలసలు ఊపందుకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇస్తూ ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు కారెక్కేందుకు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం ఖాయమనే ధీమాతో గులాబీ జెండా నీడకు చేరుకొంటున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి చక్రం తిప్పుతుండటంతో కారు పార్టీకి క్యూ కడుతున్నారు. ఆదివారం ఒక్కరోజే ఆరు గ్రామాల సర్పంచులు గులాబీ కండువా కప్పుకొన్నారు. చండూరు మండలానికి చెందిన ఐదుగురు బీజేపీ సర్పంచులు, మునుగోడు మండలానికి చెందిన ఓ సర్పంచ్ పార్టీలో చేరారు. వారికి మంత్రి జగదీశ్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు మండలం చొల్లేడుకు చెందిన 40 కుటుంబాలు, ఇద్దరు వార్డు సభ్యులు.. సర్పంచ్ మహేశ్వరి సైదులు, ఎంపీటీసీ వనం నిర్మల యాదయ్య, ఉపసర్పంచ్ శంకర్రెడ్డి, గ్రామశాఖ యేసు ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
టీఆర్ఎస్లో చేరిన సర్పంచులు వీరే..
చండూరు మండలంలోని కస్తాల సర్పంచ్ మెండి ద్రౌపతమ్మ, నెర్మట సర్పంచ్ నందికొండ నర్సిరెడ్డి, గుండ్రపల్లి సర్పంచ్ తీగల సుభాష్, దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, తుమ్మలపల్లి సర్పంచ్ కూరపాటి లక్ష్మీసైదులు తమ అనుచరగణంతో టీఆర్ఎస్లో చేరారు. మునుగోడు సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు, కోతులారం సర్పంచ్ జాజుల పారిజాత-సత్యనారాయణగౌడ్ దంపతులు గులా బీ కండువా కప్పుకొన్నారు. మునుగోడు మండలం కిష్టాపురానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మానుకుంట్ల కుమారస్వామిగౌడ్, పంతంగి లింగస్వామిగౌడ్, సురుగు లింగస్వామి, సురిగి రాజు, సురిగి వెంకన్న, జాజుల శ్రీశైలం మంత్రి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. చౌటుప్పల్ రెండు, మూడో వార్డుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్లకు చెందిన 30 మంది రజక, క్షౌర సంఘం నాయకులు మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల వరుస
నాంపల్లి మండలం నామనాయక్ తండావాసులు వివిధ పార్టీలకు 200 మంది మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. సంస్థాన్ నారాయణపురానికి చెందిన 30 ముస్లిం కుటుంబాలు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాయి. మునుగోడు మండలంలోని గూడపూర్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో కారెక్కారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో 800 మంది, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో 300 మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు.
కిషన్రెడ్డి పర్యటన.. టీఆర్ఎస్లోకి బీజేపీ మండలాధ్యక్షుడు
కేంద్రమంత్రి కిషన్రెడ్డి మునుగోడు మండలం పలివెల గ్రామంలో పర్యటిస్తుండగానే.. ఆ పార్టీ మండలాధ్యక్షుడు టీఆర్ఎస్లో చేరారు. మునుగోడు బీజేపీ అధ్యక్షుడు, పలివెల సర్పంచ్ గజ్జెల బాలరాజ్గౌడ్ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో కారెక్కారు.