Road Accident | నల్లగొండ : మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. రోడ్డుప్రమాదానికి కారణమైన లారీని కూడా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ గిరి తెలిపారు. మిర్యాలగూడ మండలం నందిపహాడ్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. డివైడర్ను ఢీకొని రోడ్డు అవతలివైపు పడిన కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మృతులను నందిపహాడ్ కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్(32), ఆయన భార్య జ్యోతి(30), కుమార్తె రిషిత(6), మహేశ్ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్(32), ఆయన కుమారుడు లియాన్సీ(2) అక్కడికక్కడ చనిపోగా, భూమా మాధవి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
చెరుపల్లి మహేశ్ హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఫోటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఏపీలోని విజయవాడ, ఇతర ప్రాంతాలకు దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడలోని నందిపహాడ్ కాలనీకి వస్తుండగా, అద్దంకి – నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఓ లారీ కారును ఢీకొట్టింది. అక్కడ మలుపు తిరిగితే మూడు, నాలుగు నిమిషాల్లో ఇంటికి వెళ్లేవారని, ఇంతలోనే ప్రమాదం జరిగింది.