White Ration Card | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం అమలుచేయబోతున్న ఆరు గ్యారెంటీలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకొంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని నిర్వహించి, ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. ఈ పథకాలకు విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని, ప్రస్తుతానికి తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు వెల్లడించారు. రేషన్కార్డు ఉన్నవారి అర్హతల ఆధారంగా దరఖాస్తు తీసుకుంటామని చెప్పారు. కొత్త రేషన్ కార్డులకు, రైతుబంధుకు కూడా ఇక్కడే దరఖాస్తులు తీసుకోబోతున్నట్టు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం రేవంత్రెడ్డి ఆదివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి మీడియాకు వివరించారు.
గ్రామాలకే అధికారుల బృందం
ప్రజా పాలనలో భాగంగా ప్రతి గ్రామం, వార్డు, డివిజన్, పట్టణాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకోసం కొంతమంది అధికారులతో కలిపి బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ‘అధికారుల బృందం ప్రతిరోజు రెండు గ్రామాలను సందర్శిస్తుంది. గ్రామాలు, తండాలు, అనుబంధ గ్రామాల్లోకి కూడా వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారు. ఉద యం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక గ్రామం లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు మరో గ్రామంలో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుంటారు. దరఖాస్తులను రెండు రోజుల ముందే కలెక్టర్ల ద్వారా ఆయా గ్రామాలకు అందజేస్తారు. గ్రామాల్లో అర్హతను బట్టి ప్రజలకు దరఖాస్తు ఫారాలు అందజేస్తారు. 28వ తేదీ నుంచి వారి అర్హతకు అనుగుణంగా దరఖాస్తు స్వీకరించి రిసిప్ట్ కూడా అందజేస్తారు’ అని వివరించారు.
టైం తక్కువ ఉన్నదని ఆందోళన వద్దు
పథకాలకు సంబంధించి దరఖాస్తుకు సమయం తక్కువగా ఉన్నదని ఆందోళన చెందొద్దని ప్రజలకు మంత్రి పొంగులేటి సూచించారు. ‘ఇదే చివరి అవకాశం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. రద్దీ ఎక్కువగా ఉండి దరఖాస్తు చేసుకోలేనివారి నుంచి తర్వాత దరఖాస్తు తీసుకుంటాం. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి వారి అర్హతను బట్టి చిత్తశుద్ధితో దరఖాస్తు తీసుకుంటాం’ అని తెలిపారు.
ధరణిలో మార్పులు చేస్తాం
గతంలో కాంగ్రెస్ చెప్పినట్టుగా ధరణిలో మార్పు లు చేయనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గతంలో భూములు కబ్జా చేసి రెగ్యులరైజ్ చేయించుకున్నారని, ఇంకా కొన్ని ఫైల్స్ ప్రాసెస్లో ఉన్నాయని చె ప్పారు. ధరణిని పూర్తిగా తొలగిస్తామని చెప్పి, ఇప్పుడు మార్పులు చేస్తామని ఎందుకు చెప్తున్నారని మీడియా ప్రశ్నించగా, ‘మంచిని మంచే అంటాం’ అని తెలిపారు. అంటే ధరణి మంచిదని అంగీకరిస్తున్నారా? అని ప్రశ్నించగా ‘ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మంచిదెలా అవుతుంది’ అని అన్నారు. డ్రగ్స్ను అరికట్టడంపైనా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ పేరు వినిపించకుండా నిర్మూలించేలా కార్యాచరణ ప్రకటించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించినట్టు చెప్పారు. ఇక అధికారులు, నేతలపై కక్షసాధింపు చర్యలు ఉండబోవని, అదే సమయంలో తప్పు చేస్తే ఎంత పెద్ద అధికారైనా, నేత అయినా చర్యలు తప్పవని హెచ్చరించినట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్కు సమ యం ఇవ్వకుండా కాంగ్రెస్ తప్పించుకుందనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. బీఆర్ఎస్ నేతలే రాష్ర్టానికి రూ.6 లక్షల కోట్ల అప్పు ఉన్నదని అంగీకరించి.. దాన్నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
దరఖాస్తు విధి విధానాలు