మర్రిగూడ, ఆగస్టు 24: శివన్నగూడెం ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తానని నమ్మబలికి ఓట్లేయించుకున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పత్తా లేకుండా పోయాడని మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్ విమర్శించారు.
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో 12 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మిస్తుండగా.. చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులకు ఇప్పటికే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తున్నది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం పరిహారం అందిస్తుండటం పట్ల భూ నిర్వాసితులు హర్షం ప్రకటిస్తూ మర్రిగూడ చౌరస్తాలో బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.