హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అబద్ధాల ప్రచార పరంపర కొనసాగుతూనే ఉన్నది. శనివారం ఢిల్లీలో ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతిపై, టీఆర్ఎస్ పాలనపై అడ్డగోలు వ్యాఖ్య లు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్లైన్తో పుట్టిన టీఆర్ఎస్ గత ఎనిమిదేండ్లలో వాటిని నెరవేర్చలేదని పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు కూడా ప్రజలకు చేరలేదని అన్నారు. నిర్మల వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ సచివాలయ నిర్మాణం గురించి మాట్లాడేముందు ఢిల్లీలో రూ.వందల కోట్లతో నిర్మిస్తున్న ‘సెంట్రల్ విస్టా’ గురించి ప్రజలకు చెప్పాలని సూచిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీకి వెన్నులో వణుకు పుట్టిందని, కేంద్రంలో తమ అధికారానికి ముప్పు వస్తుందనే భయంతోనే ఇలా రోజుకో కేంద్ర మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాళేశ్వరం నీళ్లు కనిపిస్తలేవా?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న కేంద్రమంత్రి నిర్మల వ్యాఖ్యలపై నిపుణులు మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది, ప్రాజెక్టును కడుతున్న తీరును చూసి ప్రశంసించింది, కట్టిన తర్వాత వచ్చిన ఫలితాలను చూసి అభినందించిది కూడా కేంద్ర ప్రభుత్వమే అని గుర్తుచేస్తున్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గ్రోత్ ఇంజిన్’ అని కేంద్ర మంత్రి నితిన్ గడరీ, ‘ఈ ప్రాజెక్టు ల్యాండ్ మార్క్’ అని కేంద్ర జలసంఘం చైర్మన్ మసూద్ హుస్సేన్ అభివర్ణించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్శర్మ ఓ సందర్భంలో ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అప్పులను సద్వినియోగం చేసుకొంటున్నారు. ఇది తెలంగాణకు లాభదాయక ప్రాజెక్టు’ అని ప్రశంసించారని గుర్తుచేస్తున్నారు. 2021 జూలై 22న కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ తుడు స్వయంగా లోక్సభలో ‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి ఆధారాలు లేవు’ అని ప్రకటించారు. 2014లో తెలంగాణలో వరి సాగు 34.94లక్షల ఎకరాలు, ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నులు ఉండేది. 2021లో సాగు 1.4 కోట్ల ఎకరాలకు, ధాన్యం దిగుబడి 218 లక్షల టన్నులకు పెరిగిందని, నీళ్లు ఇవ్వకుంటే ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం అంటే 3 బరాజ్లు, 16 జలాశయాలు, 21 పంప్ హౌజ్లు, 98 కిలోమీటర్ల డెలివరీ పైపులు. 203 కిలోమీటర్ల సొరంగాలు, భారీ విద్యుత్తు సబ్ స్టేషన్లు.. ఇలా వందల కాంపోనెంట్స్ కలయిక అని, ఇవేమీ కేంద్ర మంత్రికి కనిపించకపోవడం దురదృష్టకరమని మండిపడుతున్నారు.
దేశానికే తలమానికంగా అభివృద్ధి..
నిధుల వినియోగం, సంపద సృష్టిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకే తెలియకపోవడం శోచనీయమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఓవైపు ఆదాయ మార్గాలను పెంచుకుంటూ, మరోవైప రుణాలను సేకరించి అభివృద్ధి పనులకు వెచ్చించడంతో వృద్ధిరేటులో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. 2014లో దాదాపు రూ.లక్ష ఉన్న తలసరి ఆదాయం, ఇప్పుడు రూ.2.78 లక్షలకు పెరగడం, జీఎస్డీపీ రూ.5.6 లక్షల కోట్ల నుంచి దాదాపు రెట్టింపయ్యి రూ.11.50 లక్షల కోట్లకు పెరుగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ఆర్థిక మంత్రి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలుకుతున్నారు.
1.32 లక్షల నియామకాలు నిజం కాదా?
తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు న్యాయం జరుగలేదన్న నిర్మల వ్యాఖ్యలపై యువత మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇటీవలే 80వేల పోస్టులను భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే 52,460 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఇందులో 22,594 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది అని చెప్తున్నారు.