Vemulawada | వేములవాడ టౌన్ : వేములవాడ రాజన్న సన్నిధిలో సీతారాములు కల్యాణ( Sitaramula Kalyanam ) మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా సాగింది. పెళ్లి ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన శివపార్వతులలో వేములవాడ పుణ్యక్షేత్రం( Vemulawada Temple ) పులకరించిపోయింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలో శ్రీ రామ నవమి( Sri Rama Navami ) సందర్భంగా సీతారాముల కల్యాణం వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాలు, వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
విష్వక్సేన పూజతో మొదలై ఆగమ శాస్త్ర ప్రకారం సాంప్రదాయ పద్ధతిలో సాగిన ఈ కల్యాణ తంతును భక్తులు తన్మయత్వంతో చూసి తరించారు. రాముడు అవతరించిన ఈ చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం అభిజిత్ లఘ్నంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు లక్షా 50 వేలకు పైగా భక్తులు తరలివచ్చారు.
రాజన్న ఆలయం తరఫున ఆలయ ఈవో కృష్ణప్రసాద్, అధికారులు, మున్సిపల్ తరఫున చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు పట్టువస్త్రాలను అందజేశారు. వేడుకలో వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్బాబు, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, జిల్లా జడ్జి ప్రేమలత,ఆర్డీవో పవన్కుమార్ పాల్గొన్నారు.
రాములోరి కల్యాణ వేడుకను వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి హిజ్రాలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. రాములోరి కల్యాణ వేడుక అనంతరం హిజ్రాలు తాళి కట్టుకున్నారు. ఒకరికొకరు తలంబ్రాలు పోసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించారు.