Maa inti Bangaram | మూడేళ్ల విరామం తర్వాత సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని సమంతతో పాటు ఆమె భర్త రాజ్ నిడిమోరు నిర్మించగా, రాజ్ కథ, స్క్రీన్ప్లేను అందించారు. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం విడుదలై 32 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇదే సమయంలో ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతూ మంచి ఆదరణను సొంతం చేసుకోవడం విశేషం. ‘మా ఇంటి బంగారం’లో సమంత నటన, యాక్షన్, కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరించడంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
తెలుగులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం, గతంలో అనుష్క, కీర్తి సురేష్ చిత్రాల పేరుమీద ఉన్న పలు రికార్డులను అధిగమించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సమంత కమ్బ్యాక్ మరింత ఘనంగా నిలిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.99.51 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కొన్ని ట్రేడ్ వెబ్సైట్లు ఇంకా రూ.100 కోట్ల మార్క్ను అధికారికంగా నమోదు చేయకపోయినా, చిత్రబృందం మాత్రం వారం రోజుల క్రితమే సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరినట్లు ప్రకటించింది.
సినిమా కలెక్షన్ల విషయంలో సమంత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. వాస్తవ వసూళ్లను మాత్రమే ప్రకటించాలని, మిస్ లీడ్ చేసే గణాంకాలు విడుదల చేయొద్దని ఆమె చిత్రబృందానికి సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే అధికారిక లెక్కలు, ట్రేడ్ అంచనాల మధ్య స్వల్ప తేడా కనిపిస్తోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రం భారతదేశంలో సుమారు రూ.71.71 కోట్ల గ్రాస్, రూ.61.96 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసినట్లు సమాచారం. విదేశాల్లోనూ అద్భుతమైన స్పందన లభించడంతో దాదాపు రూ.27.80 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఈ సినిమా విజయవంతమైన ప్రస్థానం కొనసాగిస్తోంది. ‘మా ఇంటి బంగారం’ నిర్మాణ వ్యయం సుమారు రూ.30 కోట్ల వరకు ఉన్నట్లు సినీ వర్గాల అంచనా. అయితే డిజిటల్, శాటిలైట్, ఇతర నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలోనే దాదాపు రూ.35 కోట్ల ఆదాయం రావడంతో విడుదలకు ముందే సినిమా లాభాల్లోకి వెళ్లిందని సమాచారం.