న్యూఢిల్లీ: ఢిల్లీలోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధాని మోదీ నివాసం(PMs House) ముందు మంగళవారం కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీతో పాటు సీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ అంశంలో ఆ ధర్నా నిర్వహించారు. అయితే కట్టుదిట్టమైన లోక్ కళ్యాణ్ మార్గ్ కు కాంగ్రెస్ నేతలు అంతా ఎలా వెళ్లారని ఢిల్లీ పోలీసులు స్టన్ అయ్యారు. వాస్తవానికి మంగళవారం కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఖర్గే ఇంటికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు. సెంట్రల్ ఢిల్లీలోని రాజాజి మార్గ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే నివాసం ఉన్నది.
కాంగ్రెస్ టాప్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు అనేక మంది ఎంపీలు తొలుత మల్లిఖార్జున్ ఖర్గే ఇంటికి వెళ్లారు. ఖర్గేకు 84వ పుట్టిన రోజు విషెస్ తెలిపారు. కానీ కాంగ్రెస్ నేతలు అకస్మాత్తుగా మరో ప్లాన్ వేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ప్రధాని ఇంటి వైపు ర్యాలీ తీశారు. ఖర్గే ఇంటికి కొన్ని మీటర్ల దూరంలోనే ప్రధాని మోదీ నివాసం ఉన్నది. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ఎంపీలు .. ప్రధాని మోదీ గేటు ముందు చేరుకున్నారు. అక్కడే మెరుపు దాడికి దిగారు. సుమారు మూడు గంటల పాటు బైఠాయించారు.
ఢిల్లీ పోలీసులు ఈ ఘటనతో షాక్ అయ్యారు. సెక్యూర్టీ ఉల్లంఘన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కట్టుదిట్టమైన ప్రాంతంలోకి ఒకేసారి ఇంత మంది ఎలా వచ్చారని పోలీసులు ఆలోచిస్తున్నారు. అయితే ఖర్గే పుట్టినరోజు కావడం వల్ల ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉదయం నుంచే జనం ఉన్నారని, రాజాజి మార్గ్లో అనేక వాహనాలను కూడా పార్క్ చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 7 లోక్ కల్యాణ్ మార్గ్ లొకేషన్లో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగడం పట్ల ఢిల్లీ పోలీసులు కన్ఫ్యూజన్లో ఉన్నట్లు తెలిసింది.అయితే ఈ ఘటనకు ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియదు. కానీ ఢిల్లీ పోలీసులు మాత్రం సెక్యూర్టీ ఉల్లంఘన జరిగినట్లు అంగీకరిస్తున్నారు. ఖర్గే ఇంటికి చేరిన కాంగ్రెస్ నేతలు.. పార్లమెంట్ సమీపంలో ఉన్న విజయ్ చౌక్కు ర్యాలీ తీస్తారని భావించినట్లు కొందరు పోలీసులు చెప్పారు.