హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో పూర్తి సమాచారం రాబట్టడంలో భాగంగా కమిషన్లోని కీలక వ్యక్తులకు సిట్ నోటీసులు జారీ చేస్తున్నది. శుక్రవారం కమిషన్ కార్యదర్శి అనితారామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి నోటీసులిచ్చింది. అవసరమైతే చైర్మన్తోపాటు మిగతా సభ్యులకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తున్నది. టీఎస్పీఎస్సీ గ్రూప్-1, ఏఈ ప్రశ్నపత్రాలతోపాటు మరో నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలను కమిషన్ కార్యదర్శి పీఏ ప్రవీణ్కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి కాపీ చేశారు. వీరు కమిషన్లో పనిచేసే రమేశ్, షమీమ్తోపాటు మాజీ ఉద్యోగి సురేశ్కు కూడా గ్రూప్-1 పేపర్ అందించారు. కమిషన్ సభ్యుడు బండి లింగారెడ్డికి రమేశ్ పీఏగా పనిచేశాడు. ఈ నేపథ్యంలో కమిషన్ కార్యదర్శి, సభ్యుడికి నోటీసులు జారీ చేశారు. వీరి వద్ద నుంచి ఆయా నిందితులకు సంబంధించిన సమాచారం సేకరించనున్నారు. సిట్ కస్టడీలో ఉన్న సురేశ్, రమేశ్, షమీమ్ మూడో రోజు కస్టడీ శుక్రవారం పూర్తయ్యింది. నిందితుల నుంచి సేకరించిన సమాచారాన్ని, కాల్డాటా ఆధారంగా చేసుకొని వాళ్లు చెప్పే విషయాల్లో ఎంత వరకు వాస్తవాలున్నాయని సిట్ అధికారులు నిర్ధారించుకుంటున్నారు. మరో రెండు రోజులు నిందితులు సిట్ కస్టడీలో ఉండనున్నారు. మరో పక్క ఏఈ పేపర్ లీకేజీ కేసులో ఇటీవల అరెస్టయిన ప్రశాంత్రెడ్డి, రాజేంద్రకుమార్, తిరుపతయ్యను కస్టడీకి ఇవ్వాలని సిట్ న్యాయస్థానాన్ని కోరింది.
ఎనీడెస్క్ ద్వారా న్యూజిలాండ్కు గ్రూప్-1 పేపర్?
కస్టోడియన్ సిస్టమ్లో ఉన్న ప్రశ్నపత్రాల ఫోల్డర్ను ప్రధాన నిందితులు ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి పెన్డ్రైవ్లోకి కాపీ చేసుకున్నారు. వాటిని రమేశ్, షమీమ్, సురేశ్తోపాటు న్యూజిలాండ్లో ఉన్న రాజశేఖర్రెడ్డి బావ ప్రశాంత్కు పంపించారు. మెయిల్లో ప్రశ్నపత్రాలను పంపించేందుకు ప్రయత్నించగా సైజ్ ఎక్కువగా ఉండటంతో వెళ్లలేదని తెలిసింది. షమీమ్ కంప్యూటర్లో ఎనీడెస్క్ యాప్ ద్వారా ప్రశాంత్ ఓపెన్ చేసి తనకు కావాల్సిన ప్రశ్నపత్రాలు తీసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. షమీమ్ ఇంట్లో జరిపిన సోదాల్లో డెస్క్టాప్, ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎనీడెస్క్ యాప్ వాడారా? మెయిల్ ద్వారా పంపించారా? అనే విషయాలపై స్పష్టత కోసం ఆ రెండు సిస్టమ్స్ను సిట్ విశ్లేషించనున్నది. కస్టోడియన్ శంకర లక్ష్మిని గురువారం సిట్ సుమారు 10 గంటలపాటు విచారించి పలు విషయాలపై స్పష్టత తీసుకున్నది. ఆమె వద్ద సేకరించిన సమాచారానికి సెక్రటరీ, సభ్యుల వద్ద తీసుకొనే సమాచారాన్ని క్రాస్చెక్ చేయనున్నారు.