హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నిందితుల జాబితాలో చేర్చింది. బీఎల్తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెళ్లపల్లి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడైన కరీంనగర్కు చెందిన న్యాయవాది బీ శ్రీనివాస్ను కూడా నిందితులుగా సిట్ చేర్చింది. ఈ మేరకు సిట్ కేసులను విచారించే ఏసీబీ కోర్టుకు నివేదిస్తూ మెమో దాఖలు చేసింది. ఈ విషయాన్ని గురువారం పీటీఐ వార్తా సంస్థ ధ్రువీకరించింది. పీటీఐ కథనం ప్రకారం ఇప్పటికే రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ను ఏ1, ఏ2, ఏ3లుగా చేర్చడంతోపాటు.. వారిని కస్టడీలోకి తీసుకొని సిట్ విచారించింది. కింది కోర్టు ఆదేశాలతో ఆ ముగ్గురూ గత 25 రోజులుగా జైల్లో ఉన్నారు.
ఎమ్మెల్యేలకు ఎరకు సంబంధించిన డీల్ సందర్భంగా ఆ ముగ్గురు నిందితులు మాట్లాడిన ఆడియో, వీడియోల్లో పలుమార్లు బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ పేర్లు ప్రస్తావించినట్లు ఆధారాలు ఉన్నాయని సిట్ హైకోర్టు విచారణ సందర్భంగా చెప్పింది. అంతేకాకుండా వారితో తమకున్న సాన్నిహిత్యంపైనా ఎమ్మెల్యేలకు వివరించినట్టు రికార్డయింది. పట్టుబడిన ముగ్గురి నుంచి సేకరించిన సమాచారం మేరకు సిట్ అధికారులు బీఎల్ సంతోష్తోపాటు జగ్గుస్వామి, తుషార్ వెల్లపల్లికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. కేరళలో సోదాల్లోనూ జగ్గుస్వామి, తుషార్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ ఇద్దరికి ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు సైతం జారీచేశారు. ఈ నెల 26 లేదా 28న సిట్ ఎదుట విచారణకు హాజరుకావాలని బీఎల్ సంతోష్కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. తాజాగా బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్తోపాటు శ్రీనివాస్ల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడంతో ఈ కేసులో ఇంకెన్ని మలుపులు ఉండబోతున్నాయన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది.