TSPSC Paper Leakage | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్ష రాసి తిరిగి విదేశాలకు వెళ్లిన వారు కూడా విచారణకు రావాల్సిందేనని సిట్ తేల్చిచెప్పింది. టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి న్యూజిలాండ్లో ఉంటున్న తన బావ ప్రశాంత్కు గ్రూప్-1 ప్రశ్నపత్రం పంపించగా, అతడు ఇక్కడికి వచ్చి పరీక్ష రాసి వెళ్లాడు. ఇతనికి 103 మార్కుల కంటే ఎక్కువగా వచ్చాయి. విదేశాల్లో ఉన్నా సరే ప్రశాంత్ విచారణకు హాజరుకావాలంటూ సిట్ ఆదేశాలు జారీచేసింది. ప్రశాంత్ వస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉన్నది. విచారణకు హాజరుకాకుంటే లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్వోసీ)ని జారీ చేస్తామని సిట్ హెచ్చరించింది. మరికొందరు కూడా విదేశాల నుంచి వచ్చి గ్రూప్-1 పరీక్ష రాసినట్టు సిట్ అనుమానిస్తున్నది.
వంద మార్కులు దాటినవారు 121 మంది ఉన్నట్టు సిట్ అధికారులు జాబితా తయారు చేశారు. ఆ జాబితా ఆధారంగా 40 మందిని విచారణకు పిలిచి ప్రశించారు. ఇందులో టాలెంట్ ఉన్న 37 మంది తడబాటు లేకుండా విశ్వాసంతో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సురేశ్, రమేశ్, షమీమ్ మాత్రం సమాధానాలు చెప్పడంలో తడబడ్డారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న రమేశ్కు 123, షమీమ్కు 126 మార్కులు వచ్చాయి. ఈ ఇద్దరిని కూడా పోలీసులు సాధారణంగా విచారించడంతో తడబడ్డారు. గట్టిగా ప్రశ్నించడంతో తమకు రాజశేఖర్ ద్వారా గ్రూప్-1 పేపర్ అందినట్టు వెల్లడించారు. సురేశ్ కూడా తడబాటుతోపాటు ఆందోళనకు గురయ్యాడు. లోతుగా విచారించగా అతడు టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి అని, ప్రవీణ్కుమార్కు స్నేహితుడని తెలిసింది. గ్రూప్-1 పేపర్ ప్రవీణ్ ఇవ్వడంతో పరీక్ష రాశాలని అసలు విషయం చెప్పాడు. ఇప్పటివరకు జరిగిన విచారణలో నలుగురికి (సురేశ్, రమేశ్, షమీమ్, న్యూజిలాండ్ నుంచి వచ్చిన ప్రశాంత్) మాత్రమే గ్రూప్-1 ప్రశ్నపత్రం అందినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. వంద దాటిన మిగతా వారిని కూడా సిట్ విచారిస్తే, కొత్త వారు ఎవరైనా బయటపడితే మరిన్ని అరెస్టులు ఉండే అవకాశాలున్నాయి.
టీఎస్పీఎస్సీలో పనిచేసే 26 మంది గ్రూప్-1 పరీక్షరాయగా, ఎనిమిది మంది మెయిన్స్కు అర్హత సాధించారు. అందులో ఇద్దరికి వందకు మించి మార్కులొచ్చాయి. ఆ ఇద్దరికి ప్రశ్నపత్రం అందినట్టు విచారణలో తేలింది. మాజీ ఉద్యోగికి కూడా ప్రశ్నపత్రం అందడంతో ముగ్గురిని అరెస్టు చేశారు. తాజాగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో టీఎస్పీఎస్సీ పేపర్ కస్టోడియన్ శంకరలక్ష్మిని సాక్షిగా పోలీసులు పేర్కొన్నారు. ఏఈ పరీక్ష రాసే ముందు నిందితులైన గోపాల్, నీలేశ్లను కర్మన్ఘాట్లోని ఆర్స్క్కేర్ హోటల్లో ఉంచి ఈ నెల 4న పరీక్షకు రేణుక దంపతులు సిద్ధం చేసినట్టు తేలడంతో, ఆ హోటల్ యజమానిని కూడా విచారించి అతనిని కూడా సాక్షిగా చేర్చారు. తాజాగా అరెస్టయిన ముగ్గురిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని, గతంలో అరెస్టయిన తొమ్మిది మందిలో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, ఢాక్యానాయక్, రాజేశ్వర్ను కూడా కస్టడీ కోరుతూ సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నవాబ్పేట: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో ఉపాధి హామీ పథకంలో ఈసీ (ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ)గా పనిచేస్తున్న ప్రశాంత్రెడ్డిని సిట్ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వరకు విచారించారు. ప్రశాంత్రెడ్డి ఇటీవల ఏఈఈ పోటీ పరీక్షలు రాశాడు. ప్రశాంత్రెడ్డి వందకుపైగా మార్కులు రావడం, అతడు గతంలో గండీడ్ మండలంలో విధులు నిర్వహించడంతో విచారణ చేపట్టినట్టు తెలిసింది. పేపర్ లీకేజీలో ప్రశాంత్రెడ్డి బంధువులు, స్నేహితులు ఉన్నారన్న అనుమానంతో సిట్ అధికారి నరేందర్రావు బృందం విచారించినట్టు సమాచారం.