నిజాం కాలంలో 1938లో స్థాపించబడి.. దేశంలోనే పురాతనమైన మిల్లుగా ప్రసిద్ధి గాంచిన సిర్పూర్ పేపర్ మిల్లు చరిత్ర ఘనం. 1943లో పేపర్ ఉత్పత్తి ప్రారంభించిన ఈ సంస్థ దేశంలోనే అతి ముఖ్యమైన సంస్థగా వెలుగొందింది. ఒకనాడు వేలమంది కార్మికులకు ఉపాధిని కల్పించి లాభాలు కురిపించిన ఈ సంస్థ.. యాజమాన్యాల వైఫల్యం, పాలకుల నిర్లక్ష్యంతో నష్టాల బాట పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల ఆదరణ లేకపోవడంతో 2014లో
మూతపడింది. వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఎస్పీఎం దశ కూడా మారింది. రాష్ట్ర ప్రభుత్వ చలువతో మళ్లీ వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించే కల్పతరువుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఈ మిల్లు పునఃప్రారంభమైంది. ప్రభుత్వ రాయితీలతో కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో 2018 ఆగస్టులో మిల్లు తిరిగి ప్రారంభమైంది. నాలుగున్నరేండ్లుగా ఎస్పీఎంలో పేపర్ ఉత్పత్తి అవుతున్నది. కార్మికుల కుటుంబాల్లో సంతోషం నిండింది. పట్టణంలో వ్యాపారాలు పూర్వ వైభవం సంతరించుకొన్నాయి. నేడు ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మంది ఉపాధి పొందుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): సిర్పూర్ పేపర్ మిల్ 1938లో బిర్లా (పోదారిస్) యాజమాన్యంలో స్థాపించబడి, 1943లో ఉత్పత్తి ప్రారంభించింది. 1950లో ఎస్పీఎం బిర్లా గ్రూప్ ఆధీనంలోనికి వెళ్లింది. అప్పటి నుంచి పేపర్ ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగింది. ఇక్కడ ఆరు రకాల పేపర్లను ఉత్పత్తి చేసేవారు. రోజుకు 300 టన్నుల పేపర్ ఉత్పత్తి అయ్యేది. 2007-08లో రెండు కొత్త యంత్రాలను ఏర్పాటుచేసి ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో ఐడీబీఐ (ఇండస్ట్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో మిల్లుని తాకట్టు పెట్టి రూ.350 కోట్ల రుణాన్ని యాజమాన్యం తీసుకొన్నది. అప్పటి నుంచి కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. రుణాలను కంపెనీ అభివృద్ధికి వినియోగించక పోవడంతో సంస్థ నష్టాల బాట పట్టింది. దీంతో 2014 సెప్టెంబర్ 27న యాజమాన్యం కంపెనీని షట్డౌన్ పేరిట మూసేసింది. అప్పటికి సంస్థలో 3,200 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 1,550 మంది పర్మినెంట్ కార్మికులు కాగా.. 1,150 మంది కాంట్రాక్టు వర్కర్స్, 500 ఇతర స్టాఫ్. వీరే కాకుండా వందల మంది కార్మికులు పరోక్షంగా ఎస్పీఎం ద్వారా ఉపాధిని పొందేవారు. యాజమాన్యం నష్టాల పేరిట కంపెనీని మూసేయడంతో వీరందరూ రోడ్డున పడ్డారు. ఐడీబీఐ వద్ద తీసుకొన్న రుణం వడ్డీతో కలిపి రూ.422 కోట్లకు చేరింది. యాజమాన్యం అప్పులు తీర్చకపోవడంతో 2016 అక్టోబర్ 22న మిల్లుని ఐడీబీఐ స్వాధీనం చేసుకొన్నది. దీంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది. అప్పులకు తోడు ఇంటీరియర్ రిసొల్యుషన్ (ఎన్సీఎల్టీ).. అంటే కంపెనీకి ఉన్న అప్పులు, ఆస్తులను లెక్క తీయగా, ముడిసరుకు బకాయిలు రూ.200 కోట్లు, కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు రూ.70 కోట్లు ఉన్నట్టు తేలింది. మిల్లును ఎలాగైనా తిరిగి తెరువాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ప్రత్యేక రాయితీ జీవో 18తో అన్ని అవాంతరాలను దాటుకొని ట్రిబ్యునల్ తీర్పుతో నాలుగేండ్ల తరువాత పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 2018 ఆగస్టులో తిరిగి ప్రారంభమైంది.
మిల్లును టేకోవర్ చేసేందుకు ముందుకొచ్చిన జేకే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం పదేండ్లపాటు పలు రకాల రాయితీలు కల్పిస్తూ జీవో 18ను జారీ చేసింది. రాష్ర్ట జీఎస్టీలో (ఎస్జీఎస్టీ)లో వంద శాతం రియింబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీపై వంద శాతం రాయితీ, రూ.50 కోట్ల లోపు క్యాపిటల్ పెట్టుబడుల్లో 20 శాతం సబ్సిడీ కల్పించింది. పేపర్ తయారీకి అడవులు, మార్కెట్ నుంచి సరఫరా చేసే సుబాబుల్, ఇతర ముడిసరుకును పదేండ్లపాటు 1.5 లక్షల ఏడీఎం వరకు రాయితీ ఇచ్చింది. అవసరమైన బొగ్గును కోల్మైన్స్ నుంచి సరఫరా చేసేలా చర్యలు తీసుకొన్నది. కంపెనీ ప్రారంభించేందుకు అన్నిరకాల అనుమతులు ప్రభుత్వం కల్పించింది. డీ గ్రేడ్ అటవీ భూముల్లో మొక్కలు నాటుకొనేందుకు అవకాశం కల్పించింది. పదేండ్లపాటు విద్యుత్తు సరఫరాలో రాయితీలు కల్పించింది.
2018 ఆగస్టు 2న కేటీఆర్ చేతుల మీదుగా పునరుద్ధరణ పనులు ప్రారంభించిన యాజమాన్యం శరవేగంగా మిల్లుని ప్రారంభించింది. 2019 ఫిబ్రవరి 7న ఎస్పీఎంలో తిరిగి పేపర్ ఉత్పత్తి మొదలైంది. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతో మూతబడిన సిర్పూర్ పేపర్ మిల్లు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో పూర్వ వైభవం సంతరించుకొంటున్నది. వేల మంది కార్మికులకు జీవనాధారమైన మిల్లు కాగితం ఉత్పత్తితో కళకళలాడుతున్నది.