రాజన్న సిరిసిల్ల, మార్చి 14 (నమస్తే తెలంగాణ): సిరిసిల్లలో నేత కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం సీఐటీయూ, వపర్లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త బస్టాం డ్ వద్ద 24 గంటల రిలే దీక్ష చేపట్టగా, బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మా ట్లాడుతూ.. సిరిసిల్ల నేతన్నలపై కాంగ్రెస్ సర్కా రు కక్ష కట్టిందని ఆరోపించారు. పదేండ్లపాటు నిరంతరాయంగా నడిచిన మరమగ్గాల పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వకపోవడం, పెండింగ్లో ఉన్న బకాయిలు రూ. 290 కోట్లు విడుదల చేయని కారణంగా వస్త్ర పరిశ్రమ స్తంభించిపోయిందని విమర్శించారు.
రాజకీయాలు పక్కన బెట్టి, కార్మికుల సంక్షేమా న్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే బకాయిలు విడుదల చేయడంతోపాటు వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. బతుకమ్మ చీరలకు ఇందిర, ప్రియాంక, సోనియా ఇలా ఏదో పేరు మార్చి అయినా నేతన్నలకు ఉపాధి కల్పించి బతుకులకు భరోసా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్టీపీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, నాయకులు పాల్గొన్నారు.