హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా.. సీఎం రేవంత్రెడ్డి తొలి సంతకం చేసిన ఆరు గ్యారెంటీల అమలుకే దిక్కులేకుండా పోయిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మంగళవారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్రెడ్డి పాలన దుర్మార్గం, నయవంచనతో కొనసాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలతో ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అర్ధసత్యాలే ఉన్నట్టు పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని లోపభూయిష్టంగా తయారుచేసిన ప్రభుత్వాన్ని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తామని స్పష్టంచేశారు.
ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ఎత్తులు వేస్తున్నదని ఆరోపించారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసం జరిగిందని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే ప్రగతి సాధించినట్టు ఎలా చెప్తారని ప్రశ్నించారు. 2014లో తెలంగాణలో పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. దేశానికే ఎన్నో రంగాల్లో ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. హామీలను అమలుచేయాలనే నిబద్ధత లేకుండా మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రయత్నిస్తే అభాసుపాలవ్వడం తప్ప మరోటి ఉండదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలను నయవంచనకు గురిచేసిందని మండిపడ్డారు.
ఫించన్లు రూ.4వేలకు పెంచుతామని వృద్ధులు, వితంతువులు, వికలాంగులను మోసం చేసిందని, ఎంబీసీ వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని మర్చిపోయారని ధ్వజమెత్తారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్, కనీసం నామినేటెడ్, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని, యూరియా కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్కవర్గం సంతృప్తిగా లేరని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం డొల్లాతనాన్ని వదిలి, ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు.