రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఆర్థిక మాంద్యంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నిలిచి పోయింది. ఉత్పత్తి చేసిన పాలిస్టర్ వస్ర్తాలకు గిరాకీ లేక లక్షల మీటర్ల నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మరమగ్గాలను బంద్ పెట్టడం అనివార్యమైంది. ఒకవైపు మార్కెట్లో గతంలో విక్రయించిన వస్ర్తాలకు సంబంధించిన పైసలు రాక యజమానులు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పనిలేక నేత కార్మికులు, ఆసాములు అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు.
మార్కెట్లో పోటీని తట్టుకునే పరిస్థితి లేక సంక్షోభంలో కూరుకుపోయిన పరిశ్రమను ఆదుకునేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్వీఎం, క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి అండగా నిలిచింది. రెండున్నర నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఆర్డర్లు ఇవ్వలేదు. ఇస్తుందా? లేదా? అన్నది కూడా స్పష్టత లేకపోవడంతో యజమానులు సాంచాలు నడపడం సాధ్యం కాదంటున్నారు.
గత ప్రభుత్వంలో పదేండ్లపాటు ఎలాంటి సంక్షోభం లేకుండా నడిచిన వస్త్ర పరిశ్రమకు.. కొత్త ప్రభుత్వంలో ఇబ్బందు లు తప్పవా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి టెస్కో సంస్థ రూ.250 కోట్ల వరకు వస్త్ర పరిశ్రమకు బకాయి పడింది.
అవి ఇంకా విడుదల కాకపోవడంతో యజమాను లు, ఆసాములు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వస్త్ర పరిశ్రమపై పరోక్షంగా, ప్రత్యక్షంగా ఇరవై వేలమందికి పైగా ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఏటా బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించి జీవో ను ఫిబ్రవరి మాసంలో టెస్కో అధికారులు విడుదల చేస్తారు. ప్రభుత్వం మారడంతో ఇప్పటి వరకు అలాంటి ఊసే లేదని, వస్త్ర పరిశ్రమ బకాయిల గురించి అంతకన్నా మాట్లాడటం లేదని నేతన్నలు వాపోతున్నారు.
కేసీఆర్ సారుంటే ఇంత తిప్పలు గాకుండె
మాది తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి. నేను రోజూ సద్ది కట్టుకుని సిరిసిల్లకు వచ్చి సాంచాలు నడిపిన. భీములు, కోములు లేక సాం చాలు నడవక రెండు నెలలైతాంది. కేసీఆర్ సార్ ఉన్నపుడు బతుకమ్మ చీరలు ఇచ్చిండు. అప్పుడు వెయ్యి కూలి దొరికింది. నెలకు 20 వేలు సంపాదించిన. కొత్త సర్కారు వచ్చినంక పనిపోయింది. పాలిస్టర్కు గిరాకీ లేదని సేట్లు సాంచాలు బంద్పెట్టిండ్రు. కొత్త సర్కారు బతుకమ్మ ఆర్డర్లు, పాత బకాయిలిస్తెనే నడుపుతమంటున్నరు. పొట్టకు బాగా తిప్పలైతాంది. 5 అన్నపూర్ణ భోజనం తిని కాలం గడుపుతున్న.
– మ్యాన లస్మయ్య, మరమగ్గాల కార్మికుడు, బద్దెనపల్లి, తంగళ్లపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా
తక్షణం ప్రతి కార్మికుడికి 15 వేలు ఇవ్వాలి
సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని దృష్టి లో పెట్టుకుని కేసీఆర్ ప్ర భుత్వం అనేక ఆర్డర్లు ఇ చ్చింది. ఇచ్చిన ఆర్డర్లతో నేతన్నలకు మంచి గిట్టుబాటు కూలీతో చేతినిండా పనిదొరికింది. వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. కొత్త ప్ర భుత్వం ఆర్డర్లు ఇస్తుందా? లేదా? అన్నది స్పష్టత లేదు. బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిల గురించి ఉలుకూ పలుకూ లేదు. పరిశ్రమ బంద్ వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికుడికి తక్షణ సాయంగా రూ.15 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలి.
-ఉడుత రవి, సీఐటీయూ, తెలంగాణ పవర్లూమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు
వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నం
తయారైన పాలిస్టర్ వస్ర్తాలకు మార్కెట్లో గిరాకీ లేదు. మీటరుకు రూపాయి నష్టం వస్తంది. రూ.20 కోట్ల విలువైన వస్ర్తాలు అమ్ముడు పోక నిల్వ ఉన్నది. బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి సర్కారు రూ.250 కోట్లు ఇవ్వాలి. మంత్రులను కలిశాం. ఇస్తామని హామీ ఇచ్చారు. చుట్టూ తిప్పుకుంటున్నరు. కానీ, ఇవ్వడం లేదు. పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నం. సర్కారు పెండింగ్ బకాయిలు ఇస్తేనే సాంచాలు నడిపే పరిస్థితి ఉంది. సిరిసిల్లలో 30 వేల మరమగ్గాలుంటే అందులో సగం బంద్పెట్టినం.
-మండల సత్యం, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు