సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా తెనుగువారిపల్లెలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన మెడలో బంగారు గొలసును దొంగలు ఎత్తుకెళ్లారని ఓ అవ్వ.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో జిల్లా పోలీస్ బాస్ తన సొంత డబ్బుతో చైన్ చేయించి ఆమెకు ఇచ్చారు. దీంతో ఆనందం వ్యక్తంచేసిన ఆ అవ్వ.. ఎస్పీకి సలాం కొట్టింది.
సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే కమ్యూనిటీ పోలీస్లో భాగంగా జిల్లాలోని మారుమూల గ్రామమైన తెనుగువారిపల్లెలో గత నెల పోలీస్ నేస్తం అనే కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఊర్లో ఒక పెళ్లి కార్యక్రమం జరుగుతున్నప్పుడు తన మెడలో ఉన్న బంగారు గొలుసు ఎవరో దొంగతనం చేశారని ఎస్పీ వద్ద ఆవేదనతో చెప్పుకున్నది.
దీంతో చలించిపోయిన ఎస్పీ తానే స్వయంగా బంగారు గొలుసు చేయించి ఇస్తానని హామీ ఇచ్చారు. సరిగ్గా నెల తర్వాత ఎస్పీ రాహుల్ హెగ్డే బంగారు గొలుసు చేయించి ఆ పండు ముసలావిడకి అందజేశారు. దాంతో ఆ అవ్వ ఆనందం అంతా ఇంతా కాదు. జిల్లా ఎస్పీ తనపై చూపించిన ప్రేమకి ఆనందభాష్పాలు రాల్చింది. ఎస్పీకి సలాం కొట్టి పోలీసులు చల్లగా ఉండాలని దీవించింది. పోలీసులు తన పట్ల చూపిన ప్రేమకి రుణపడి ఉంటానని తెలిపింది.