Single use Plastic | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల మనిషి శరీరంలో మైక్రో ప్లాస్టిక్ పేరుకుపోతున్నదని, అది రక్తంలో కలిసి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూమి పొరలపై ఉండిపోయి, వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా అడ్డుపడుతున్నదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. 1950-2015 మధ్య కాలంలో ప్లాస్టిక్ ఉత్పత్తి 200 రెట్లు పెరిగింది. కానీ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ తగిన స్థాయిలో పెరగలేదు. దీంతో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
పూర్తిస్థాయి నిషేధం ప్రజల చేతుల్లోనే..
120 మైక్రాన్ల వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వినియోగించవద్దని ప్రభుత్వాలు కూడా నిషేధం విధించాయి. అయితే, పూర్తి స్థాయిలో ఇది అమలు కావాలంటే ప్రజలందరు సహకరిస్తేనే సాధ్యమని అధికారులు చెప్తున్నారు. ఇటీవల జరిగిన ఒక సర్వే లో ప్లాస్టిక్ వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలపై అవగాహన ఉన్నదని 86 శాతం మంది తెలిపారు. అయితే అవసరాలు, రవాణాకు అనువుగా ఉండటం, వ్య యపరంగా తక్కువగా ఉండటంతో ప్లాస్టిక్ వాడకం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 120 మైక్రాన్లకంటే ఎక్కువ ఉండే ప్లాస్టిక్ వస్తువులను పాత సామాన్లు కొనేవారు, వీధులు, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను సేకరించేవారు తీసుకొంటున్నారు. 120 మై క్రాన్ల కంటే తక్కువ సామర్థ్యం కలిగిన వాటిని ప్లాస్టి క్ కంపెనీలు తిరిగి సేకరించడం లేదు. ప్రజల్లో చైత న్యం వచ్చి వాడకం తగ్గిస్తే తప్ప ప్లాస్టిక్కు అడ్డకట్ట వేయలేమని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు.
గ్రీన్ హబ్ ఏర్పాటు చేశాం
సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో అనేక అనర్థాలు ఉన్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగితే, నీటి రూపంలో ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంది. ఇది అత్యంత ప్రమాదం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ప్రభుత్వమే అరికట్టలేదు.. ప్రజల్లోనూ చైతన్యం రావాలి. ఈపీటీఆర్ఐ ద్వారా అనేక శిక్షణా, అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. పంచాయతీరాజ్ శాఖ అమలు చేస్తున్న స్టీల్ బ్యాంక్ విధానం బా గుంది. ఈపీటీఆర్ఐ ద్వారా గ్రీన్ హబ్ను ఏర్పాటు చేశాం. ఇటీవల బయోడిగ్రేడబుల్ వస్తువులు అని ప్రచారం చేస్తున్నారు. వాటిల్లో కొన్ని కాదని గుర్తించాం.
– వాణీప్రసాద్, డైరెక్టర్ జనరల్, ఈపీటీఆర్ఐ