Singareni | రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన 33 శాతం లాభాల వాటా బోనస్ను వచ్చే నెల 9న చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు మంగళవారం సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలతో సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి సంస్థ 2023- 24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలలో 33 శాతం అంటే రూ.796 కోట్లు లాభాల వాటా బోనస్గా చెల్లిస్తామని ఇటీవల ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. కార్మికులకు సింగరేణి చరిత్ర లో ఇది అత్యధికం కావడం విశేషం. సంస్థలో పనిచేస్తున్న సుమారు 42 వేల మంది అధికారులు, కార్మికులకు ఈ లాభాల వాటాను పంపిణీ చేయనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తాము పనిచేసిన పని దినాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని లాభాల వాటా బోనస్ చెల్లిస్తారు. సగటున ఒక్కొక్కరు సుమారు రూ.1.90 లక్షల చొప్పున బోనస్ పొందే అవకాశం ఉంది.
సింగరేణి లో పని చేస్తున్న దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు లాభాల వాటా బోనస్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా విధి విధానాలను రూపొందించాలని సంస్థ అధికారులను సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో వివిధ కాంట్రాక్టర్ల వద్ద పనిచేసిన వారి వివరాలు పూర్తిగా సేకరించాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పండుగకు ముందే వారికి కూడా బోనస్ చెల్లింపు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
లాభాల వాటా బోనస్ తో పాటు సింగరేణి సంస్థ ఎప్పటి లాగానే ఈ ఏడాది కూడా దసరా పండుగ అడ్వాన్స్ ను సింగరేణి ఉద్యోగులకు చెల్లించాలని సీఎండీ బలరామ్ ఆదేశించారు. ఒక్కొక్కరికి రూ.25 వేల పండుగ అడ్వాన్స్ చెల్లించనున్నారు. దీని కోసం సంస్థ రూ.95 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సెప్టెంబరు నెల జీతాలతోపాటే ఈ పండుగ అడ్వాన్స్ సొమ్మును కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. లాభాల వాటా బోనస్, దసరా పండుగ అడ్వాన్సులు కలిపి దాదాపు రూ.900 కోట్లు సింగరేణి ఉద్యోగులకు చెల్లించనున్న నేపథ్యం లో సింగరేణి సిబ్బంది వ్యవహారాలు, ఆర్థిక విభాగాలు తగు ఏర్పాట్లు చేయాలని సీఎండీ ఆదేశాలు జారీ చేశారు.