హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బొగ్గు, విద్యుత్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మొదటి త్రైమాసికంలో బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.6,337 కోట్ల టర్నోవర్ సాధించగా.. మొత్తం 663.32 కోట్ల లాభాలను నమోదు చేసింది. మొత్తమ్మీద మొదటి త్రైమాసికంలో 78 శాతం వృద్ధిని సాధించింది.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.5,393 కోట్ల బొగ్గు అమ్మకాలు జరిపి గత ఏడాది ఇదే కాలానికి సాధించిన అమ్మకాలపై 89.16 శాతం వృద్ధిని సాధించింది. తద్వారా సుమారు రూ.394.89 కోట్ల లాభాలను నమోదు చేసింది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ బొగ్గు ఉత్పత్తి, రవాణాను గత ఏడాది కన్నా ఎక్కువ స్థాయిలో చేయడంతో ఇది సాధ్యమైంది.
గత ఏడాది మొదటి త్రైమాసికంలో సింగరేణి సంస్థ రూ.2,851 కోట్ల బొగ్గు అమ్మకాలు జరిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 15.57 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 16.7 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా జరపడంతో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్,ఎండీ ఎన్. శ్రీధర్ ఉద్యోగులందరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే ఒరవడిని కొనసాగించి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు.