హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్లో మే నెల నుంచి ఉత్పత్తిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఆ గని నుంచి వెలికితీసే బొగ్గును సమీపంలోని హండపా రైల్వే సైడింగ్ నుంచి రవాణా చేయాలని సింగరేణి డైరెక్టర్ల బోర్డు సమావేశం నిర్ణయించింది. సింగరేణి భవన్లో శుక్రవారం సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. నైనీ బ్లాక్ నుంచి రోడ్డు మార్గంలో హండపా రైల్వే సైడింగ్ వరకు బొగ్గును రవాణాచేసి, అక్కడి నుంచి రైల్వే వ్యాగన్లలో లోడ్చేసే పనులకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్టు శ్రీధర్ వెల్లడించారు. నైనీ బ్లాక్ నుంచి ఏటా దాదాపు కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని, ప్రస్తుతం ఆ గనికి సమీపంలోని రైల్వే స్టేషన్కు కొత్త రైల్వేలైన్ నిర్మితమవుతున్నదని తెలిపారు. ఈ మార్గం అందుబాటులోకి వచ్చేవరకు రెండేండ్లపాటు రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాకు కాంట్రాక్టును ఏర్పాటు చేసుకునేందుకు బోర్డు అనుమతించినట్టు వివరించారు. వీటితోపాటు రామగుండం ఓసీ-2 విస్తరణ, కోయగూడెం-2 ఓసీలో ఓవర్ బర్డెన్ తొలగింపు పనులకు, వివిధ ఏరియాల్లో భారీయంత్రాలకు, 70 డంపర్లకు అవసరమైన విడిభాగాల కొనుగోలుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ఏరియాల్లో కార్మికులకు తాగునీటి సౌకర్యం కల్పించే గ్రావిటీ ఫిల్టర్బెడ్ నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సుల పునరుద్ధరణ కోసం రూ.3 కోట్ల విరాళాన్ని అందించేందుకు అంగీకరించింది.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి ఆదాయ, వ్యయాల నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎలాంటి అభ్యంతరాలు తెలుపకుండా ఆమోదించడంపై డైరెక్టర్ల బోర్డు హర్షం వ్యక్తం చేసింది. సమావేశంలో బోర్డు సభ్యుడు, తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సోలంకి, డైరెక్టర్ సంతోష్, డబ్ల్యూసీఎల్ సీఎండీ మనోజ్కుమార్, సింగరేణి డైరెక్టర్ బలరామ్, సత్యనారాయణరావు, ఎస్వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వర్రెడ్డి, కంపెనీ సెక్రటరీ సునీతాదేవీ, జీఎం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.